KTR: ఈ-ఫార్ములా కేసులో భాగంగా కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అర్వింద్కుమార్, మరికొంతమందిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వీరికి నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు..
ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఈడీ ఏసీబీ ఆఫీస్ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ) ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక విచారణ టైమ్లో న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుందని, హైప్రొఫైల్ కేసు కావడంతో వివరాలు రహస్యంగా ఉంచుతున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ సహా మిగతా వాళ్లను హెడ్ క్వార్టర్స్లోనే ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసిన ఏసీబీ.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
రూ.55 కోట్లు అక్రమంగా చెల్లింపు..
ఈ ఫార్ములా–ఈ రేస్ కార్ల ఇష్యూలో విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు అక్రమంగా చెల్లించారని ఆరోపణలున్నాయి. దీనిపై అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్వింద్ కుమార్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను చెల్లింపులు చేసినట్టు అర్వింద్ బయటపెట్టారు. విదేశాల్లో ఉన్న కంపెనీకి ఆర్బీఐతో పాటు ఇతరత్రా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే చెల్లింపులు చేశారని తెలిపారు. సీజన్10 విషయంలో నిబంధనలు పాటించలేదని, నిధులు పంపిన 18 రోజులకు ఎన్నికల కోడ్ టైంలో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకపోవడంతో హెచ్ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడిందని చెప్పారు.
ఇది కూడా చదవండి: 'గేమ్ ఛేంజర్' కొత్త పాట.. ప్రోమో అదిరిపోయింది, ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
ఇక 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్ములా–ఈ కార్ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మొత్తం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. హెచ్ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ 9 విజయవంతం కావడంతో సీజన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా–ఈ ఆపరేషన్ (ఎఫ్ఈవో)తో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ కుదుర్చుకోగా అగ్రిమెంట్కు ముందే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రూ.55 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించడం వివాదాస్పదమైంది.