TGPDCL: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకపై వాతే!

విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇండ్లలో నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిర చార్జీని రూ.50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ఇది 2025లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. 

author-image
By srinivas
New Update
Current Bill: విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్‌ కోడ్‌ విధానం!

TGPDCL: రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు సర్కారు సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల విద్యుత్‌ పంపిణీ సంస్థలు చార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీకి నివేదికను అందజేశాయి. తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు చార్జీలు పెంచాల్సిన అవసరముందని ఈఆర్సీని కోరాయి. త్వరలో దీనిపై బహిరంగ విచారణ జరిపి.. కీలక నిర్ణయం తీసుకోనుంది ఈఆర్సీ. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి. మూడు కేటగిరీల్లో చార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. వీటిని ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి రూ.1200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. 

బహిరంగ విచారణ తర్వాతే తుది తీర్పు


ఈ ప్రతిపాదనలపై రాష్ట్రంలో కనీసం మూడుచోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేశాకే ఈఆర్సీ తుది తీర్పు ఇస్తుంది. అనంతరమే చార్జీల సవరణ అమలులోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజుల సమయం పడుతుంది. తెలంగాణలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.14,222 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి. ఈ మొత్తంలో రూ.13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలిన రూ.1200 కోట్ల లోటు పూడ్చుకునేందుకు చార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: TG Group-3: గ్రూప్‌-3 అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్‌ విడుదల!

300 యూనిట్లు దాటితే మోతే..


ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిర చార్జీని ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తుండగా, రూ.50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంట్ వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిరచార్జీ పెంపు ఉండదు. రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్లకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారు. దీని వల్ల ప్రజలపై పెద్దగా స్థిరచార్జీ పెంపు భారం పడదని డిస్కంలు చెబుతున్నాయి.

పరిశ్రమలన్నింటికీ ఒకటే రేటు..
ప్రస్తుతం హెచ్‌టీ పరిశ్రమల జనరల్‌ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 11 కేవీ సామర్థ్యంతో కనెక్షన్‌ తీసుకున్న పరిశ్రమ వినియోగించుకున్న కరెంట్‌​కు యూనిట్‌కు 7.65 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. 33 కేవీ సామర్థ్యంతో కనెక్షన్‌ తీసుకుంటే 7.15 రూపాయల చొప్పున, 132 కేవీ అయితే 6.65 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్‌కు 7.65 రూపాయల చొప్పునే వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. పరిశ్రమల నుంచి కిలోవాట్‌కు రూ.475 చొప్పున వసూలు చేస్తున్న స్థిర చార్జీని రూ.500లకు పెంచాలని కోరాయి. 

ఇది కూడా చదవండి: లేడీ అఘోరాకు బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు!

డిస్కంలకు రూ.21 లక్షల జరిమానా
ఈ నివేదికను 2023 నవంబర్ 30 కల్లా మండలికి ఇవ్వాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదు. 2024 జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించినా లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి. దాంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆలస్యానికి రూ.21 లక్షల జరిమానాను డిస్కంల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది. ఏఆర్ఆర్ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు డిస్కంల ఈక్విటీలో నెలకు 0.5 శాతం చొప్పున వసూలు చేస్తామని ఈఆర్సీ చెప్పింది. ఇది కూడా డిస్కంలకు నష్టమేనని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన చార్జీల సవరణ ఏఆర్ఆర్ నివేదికను సైతం 2024 నవంబర్ కల్లా ఈఆర్సీకి ఇవ్వాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు