/rtv/media/media_files/2025/09/23/cm-revanth-reddy-2025-09-23-15-14-34.jpg)
జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారంలో మొక్కులు చెల్లించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం, ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నానని అన్నారు.
ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు తాను ఇక్కడినుంచే పాదయాత్ర మొదలుపెట్టానని గుర్తుచేశారు. 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డపై నుంచి తెలంగాణకు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు అడుగులు వేశామన్నారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు అని సీఎం అభిప్రాయపడ్డారు.
ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా
ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని వెల్లడించారు. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో మంత్రి సీతక్కకు, తనకు ఈ జన్మ ధన్యమైనట్లేనని సీఎం చెప్పుకొచ్చారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.
రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయన్న సీఎం రేవంత్.. అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామని తెలిపారు. మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. సమ్మక్క సారక్క మాలధారణ చేసినట్లుగా భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించానని వెల్లడించారు. మహాజాతరకు మళ్లీ వస్తా… ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామని సీఎం తెలిపారు.