Medical Colleges : రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్రం అనుమతులిచ్చింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతులిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో‌ నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు

author-image
By Bhavana
రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌
New Update

Medical Colleges :

తెలంగాణ రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ పచ్చ జెండా ఊపింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్‌ ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ను ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఓ లేఖను పంపింది. ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

8 కాలేజీల్లో 400 సీట్లు..

ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది.ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసింది.

జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్‌ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమని తెలిపారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో, అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు తీసుకెళ్లింది.

ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్‌ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి, యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు స్టాఫ్‌ను నియామకం చేశారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు‌. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిట‌ల్‌లో ఉండాల్సిన లాబోరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్వి‌ప్‌మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు.

ఈ క్రమంలోనే ఎన్‌ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్‌ కి పంపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు, డాక్టర్ల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు.

రాజనర్సింహా కృతజ్ఞతలు..

ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ‌చేయాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో‌ అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, అడిషనల్‌ డీఎంఈ విమలా థామస్, ఇతర ఉన్నతాధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల‌ విషయంలో ప్రభుత్వం కమిట్‌మెంట్, చిత్తశుద్ధితో ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు‌.

Also Read :  ఉధృత గోదావరి.. 50 అడుగులు దాటి నిలకడగా వరద!
#medical-colleges #cm-revanth-reddy #central-government
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe