/rtv/media/media_files/ei2Wb7uqtyTM7c9GQUhd.jpg)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. 2016లో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేయగా తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సోమవారం ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షల కోసం న్యాయస్థానాలను వాడుకోవద్దని ఈ సందర్భంగా పిటిషనర్లకు గట్టిగా హితవు పలికింది.
ఇంతకు ఏం జరిగిందంటే ..
ఈ కేసు 2016నాటిది. హైదరాబాద్ లోని గోపనపల్లిలోని కొన్ని భూముల విషయంలో రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని అంతేకాకుండా తమను కులం పేరుతో దూషించారంటూపెద్దిరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అప్పట్లోనే ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. అయితే, పిటిషనర్ పట్టుబదలకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన రోజు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నట్లు ఎవరూ చూడలేదు. కేవలం ఎవరో చెప్పిన మాటల ఆధారంగా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు వెనుక వ్యక్తిగత, రాజకీయ కారణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
కేవలం పోలీసులు ఛార్జిషీట్ వేశారన్న మాత్రాన దానికి పూర్తి విలువ ఉంటుందని అనుకోలేమని, బలమైన ఆధారాలు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది.కోర్టులను రాజకీయ పోరాట వేదికలుగా మార్చడం దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషనర్ వాదనల్లో బలం లేదని తేల్చిన ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కేసును పూర్తిగా కొట్టివేసింది. రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు.
Follow Us