/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
murder
Inter Caste Incident : కంప్యూటర్ యుగంలోనూ కులం, మతం పేరుతో సాగుతున్న ఆగడాలకు అంతులేకుండా పోతోంది. కులోన్మాదంతో కొట్టుకోవడం, చంపుకోవడం సర్వసాధారణమై పోయింది. అలాంటి కులోన్మాద హత్య పాలమూరు జిల్లాలో కలకలం రేపింది. తక్కువ కులం యువకుడు తన బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో రగిలిపోయిన ఆ తండ్రి.. ఆ యువకుడి అన్నను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ కులోన్మాద హత్య మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద శివారు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కాగుల వెంకటేశ్ కూతురు భవాని'(18), అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (25) అనే దళిత యువకున్ని ప్రేమించింది. చంద్రశేఖర్ ఆటో నడుపుకొంటున్నాడు. భవాని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఇటీవలె మైనార్టీ తీరింది. దీంతో నెలరోజుల క్రితం ఇద్దరు పెద్దలకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ విషయంలో భవాని కుటుంబసభ్యులు షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దానిప్రకారం అమ్మాయి, అబ్బాయి వేర్వేరుగా ఉండేలా పెద్దల మధ్య ఒప్పందంకుదిర్చారు. అన్నట్లుగానే ఎవరింటికి వారు వెళ్లారు. అయితే ఫోన్లో మాత్రం అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఇటీవల ఇద్దరూ కలిసి ఇంట్లో చెప్పకుండా ఊర్లో నుంచి వెళ్లిపోయారు. కాగా చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ (30) తన భార్యతో కలిసి షాద్నగర్లోని అయ్యప్ప కాలనీలో ఆరేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు.
తన కూతురును చంద్రశేఖర్ తీసుకెళ్లడంతో కోపంతో రగిలిపోయాడు. వారికోసం వెతికినా ఆసూకీ లభించలేదు. దీంతో వెంకటేశ్ బుధవారం రాత్రి కొంతమందిని వెంటేసుకొని షాద్నగర్కు వెళ్లాడు. రాజశేఖర్ను ఇంట్లో నుంచి బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతరం అతడిని అదేరోజు రాత్రి మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం యన్మన్గండ్ల శివారులో చంపేశాడు. మృతదేహాన్ని పెట్రోలు పోసి కాల్చివేశాడు. కిడ్నాప్ జరిగిన రోజే మృతుడి భార్య వాణి షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా విషయం తెలియడంతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భవాని, చంద్రశేఖర్ అచూకీ మాత్రం ఇంతవరకు లభించలేదు.
Follow Us