/rtv/media/media_files/2026/02/15/ind-vs-pak-2026-02-15-20-40-36.jpg)
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చిరకాల ప్రత్యర్థి భారత్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అనుసరించిన వ్యూహం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించగా, అందులో ఆరుగురు స్పిన్నర్లు ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఆరుగురు స్పిన్నర్లను ఉపయోగించిన తొలి జట్టుగా పాకిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సాధారణంగా పేసర్లకు అనుకూలించే పిచ్లపై కూడా పాక్ ఈసారి స్పిన్ అస్త్రాన్ని నమ్ముకోవడం గమనార్హం.
స్వయంగా మొదటి ఓవర్ వేసి
పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్వయంగా మొదటి ఓవర్ వేసి, ప్రమాదకరమైన అభిషేక్ శర్మను డకౌట్ చేసి భారత్కు షాకిచ్చారు. ఆ తర్వాత నాలుగో ఓవర్లోనే పార్ట్-టైమ్ స్పిన్నర్ సైమ్ అయూబ్ను రంగంలోకి దించారు. బ్యాటర్గా సుపరిచితుడైన సైమ్ అయూబ్, బంతితోనూ మాయ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
ముఖ్యంగా సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్ (78)ను అవుట్ చేయడమే కాకుండా, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను వరుస బంతుల్లో అవుట్ చేసి భారత్ను ఆత్మరక్షణలో పడేశాడు. వీరే కాకుండా అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ మరియు ఉస్మాన్ తారిఖ్ కూడా స్పిన్ బాధ్యతలు పంచుకున్నారు.
Follow Us