Kranti Gaud : ప్రపంచ్ కప్పే కాదు... తండ్రికి పోయిన ఉద్యోగాన్ని కూడా తెచ్చి పెట్టింది!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ పేసర్ క్రాంతి గౌడ్ (కేవలం దేశానికే కాదు, తన కుటుంబానికి కూడా ఒక మరుపురాని విజయాన్ని అందించింది.

New Update
kranthi gaud

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ పేసర్ క్రాంతి గౌడ్ (కేవలం దేశానికే కాదు, తన కుటుంబానికి కూడా ఒక మరుపురాని విజయాన్ని అందించింది. ఆమె అద్భుత ప్రదర్శన కారణంగా, 2012లో ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రికి మళ్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం దక్కనుంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్‌ను సీఎం మోహన్ యాదవ్ ఆదివారం భోపాల్‌లో కోచ్ సమక్షంలో సన్మానించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. క్రాంతి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. అంతేకాకుండా, 2012లో ఎలక్షన్ డ్యూటీ సమయంలో జరిగిన ఒక ఘటన కారణంగా సస్పెండ్ అయిన క్రాంతి తండ్రి మున్నా సింగ్ గౌడ్‌ను తిరిగి పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.క్రాంతి దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. ఆమె తండ్రి గౌరవాన్ని తిరిగి నిలబెట్టడం సరైన విషయమని సీఎం వ్యాఖ్యానించారు.

పూట గడవడానికి కూడా ఇబ్బంది

తండ్రి ఉద్యోగం కోల్పోయిన తర్వాత తమ కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొందని క్రాంతి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని రోజులు పూట గడవడానికి కూడా ఇబ్బంది పడ్డాం. మా తల్లిదండ్రుల కష్టం కళ్లారా చూశా. మళ్లీ ఆయన పోలీసు యూనిఫాంలో రిటైర్ అవ్వాలని నా కల అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం, అవమానాలను తట్టుకుని, కష్టపడి క్రికెటర్‌గా ఎదిగిన క్రాంతి.. ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది.

క్రాంతి తన ప్రదర్శనతో కేవలం ప్రపంచ కప్ టైటిల్‌ను మాత్రమే కాక, తన తండ్రికి 13 ఏళ్ల తర్వాత కోల్పోయిన గౌరవాన్ని, ఉద్యోగాన్ని కూడా తిరిగి తీసుకురావడం ఒక స్ఫూర్తిదాయకమైన కథగా నిలిచింది. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా క్రాంతి గౌడ్‌కు కోటి రూపాయల నజరానాను కూడా ప్రకటించారు. ఈ వేడుకలో సీఎం మోహన్ యాదవ్ తో పాటుగా క్రీడలు, యువజన సంక్షేమ మంత్రి విశ్వాస్ సారంగ్ కూడా గౌడ్ తల్లిదండ్రులను,కోచ్‌ను సత్కరించారు. 

నవంబర్ 15న గిరిజన ఐకాన్, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జబల్‌పూర్‌లో క్రాంతి గౌడ్‌ను మరోసారి సత్కరిస్తామని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు