/rtv/media/media_files/2025/09/13/nithish-rane-2025-09-13-15-58-07.jpg)
బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే కీలక కామెంట్స్ చేశారు. శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను ఆదిత్య థాకరే బురఖా ధరించి చూస్తారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా అతను పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కూడా చేస్తాడని రాణే కామెంట్స్ చేశారు. ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ మెరైన్ డ్రైవ్లో బ్లాక్ టికెట్లు అమ్ముతూ కనిపిస్తారని ఫైరయ్యారు. అంతేకాకుండా, ఆయన ఆదిత్య థాకరే గొంతును అనుకరిస్తూ ఎగతాళి చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై ఆదిత్య థాకరే అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో నితేశ్ రాణే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ థాకరే ఇప్పటికే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం దేశ వ్యతిరేకం అని విమర్శించారు. దీనిపై స్పందించిన నితేశ్ రాణే, థాకరేలపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లను వ్యతిరేకించాలని, ముఖ్యంగా పుల్వామా ఉగ్రదాడి తర్వాత, ఆ దేశంతో క్రికెట్ సంబంధాలను కొనసాగించకూడదని శివసేన (యుబిటి) వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిజెపి, శివసేన (యుబిటి) మధ్య ఈ మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ రాజకీయ ఘర్షణ క్రికెట్ మ్యాచ్కు మరింత ఉద్రిక్తతను పెంచింది. కాగా ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 14న కీలక మ్యాచ్ జరగనుంది. రాజకీయ, ఉగ్రవాద ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు జరగడం లేదు. అయితే, ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.
ఇప్పటి వరకు 16 సార్లు పోటీ
ఇక భారత్ తమ మొదటి మ్యాచ్లో యూఏఈని 9 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించింది. ఈ మ్యాచ్లో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి, యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్లో ఒమన్పై 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వారి బ్యాటింగ్ , బౌలింగ్ రెండూ బలమైన ప్రదర్శన చేశాయి. భారత్ , పాకిస్తాన్ జట్లు ఆసియా కప్లో ఇప్పటి వరకు 16 సార్లు తలపడ్డాయి. ఈ రికార్డులలో భారత్ 9 సార్లు గెలవగా, పాకిస్తాన్ 6 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే, ప్రస్తుత ఫామ్, జట్ల బలం ఆధారంగా చూస్తే, ఇది ఇరు జట్ల మధ్య ఒక హోరాహోరీ పోరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్ టాప్ పొజిషన్ను నిర్ణయించడంలో కీలకం కానుంది.