IPL 2024: రోహిత్‌ శర్మ ఖాతాలోకి అరుదైన రికార్డ్..

రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఏప్రిల్ 18న గురువారం పంజాబ్ కింగ్స్‌(PBKS) వర్సెస్‌ ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్‌లో ఈ అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనున్నాడు. ఆ రికార్డ్ విశేషాలేంటో చూసేయండి!

New Update
IPL 2024: రోహిత్‌ శర్మ ఖాతాలోకి అరుదైన రికార్డ్..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో ప్రతి సీజన్‌లో పాత రికార్డులు బద్ధలవుతుంటాయి, కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన రికార్డులు అధిగమించడం సాధ్యం కాదు. ఇలాంటివి ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ ప్లేయర్‌, కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్‌ శర్మ ఖాతాలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ మరో అరుదైన రికార్డును అందుకోనున్నాడు. ఏప్రిల్ 18న గురువారం పంజాబ్ కింగ్స్‌(PBKS) వర్సెస్‌ ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్‌లో అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనున్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని(256) పేరిట ఉంది. పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌లో బరిలో దిగే రోహిత్‌ 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రెండో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్‌ చేయనున్నాడు. 249 మ్యాచ్‌లతో ప్రస్తుతం రోహిత్‌ శర్మ, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ దినేష్ కార్తీక్‌తో సమంగా ఉన్నాడు.

* ధోని తర్వాత రోహిత్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ముందు ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. కాబట్టి దినేష్‌ కార్తీక్ కంటే ముందు రోహిత్‌ 250 ఐపీఎల్‌ మ్యాచ్‌ల మైల్‌స్టోన్‌ క్రాస్‌ చేయనున్నాడు. బెంగళూరు ఏప్రిల్‌ 21న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR)ని ఢీకొనబోతోంది. 256 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోని ఎలైట్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. IPL 2023 ఫైనల్‌ అతనికి 250వ మ్యాచ్‌ కావడం గమనార్హం. ఈ ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై చెన్నై విజయం సాధించింది. ఈ గెలుపుతో అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ముంబై రికార్డును చెన్నై సమం చేసింది. అలానే అత్యధిక టైటిల్స్‌ గెలిచిన కెప్టెన్‌గా ధోని, రోహిత్‌ను సమం చేశాడు.

.

* హిట్‌మ్యాన్‌ ఐపీఎల్ కెరీర్‌

రోహిత్ శర్మ 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో తన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు.డెక్కన్ ఛార్జర్స్‌ IPL 2011 మెగా-వేలంలో రోహిత్‌ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించింది. కానీ ముంబై ఇండియన్స్ (MI) రోహిత్ కోసం రూ.9.2 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి, సొంతం చేసుకుంది. అప్పటి నుంచి రోహిత్‌ ముంబైలో కొనసాగుతున్నాడు. 2013 సీజన్‌లో రికీ పాయింట్‌ స్థానంలో రోహిత్‌, MI కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అప్పటికి రోహిత్ టీమ్ ఇండియాలో రెగ్యులర్‌ ప్లేయర్‌ కూడా కాకపోవడం గమనార్హం.

ఆ తర్వాత రోహిత్ కెప్టెన్‌గా ముంబైకి ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు అందించాడు. అత్యధిక టైటిల్స్‌ గెలిచిన మొదటి కెప్టెన్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. కెప్టెన్‌గా 158 మ్యాచ్‌ల్లో 87 విజయాలు సాధించాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి హిట్‌మ్యాన్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి వచ్చిన హార్దిక్‌ పాండ్యాకి ఎంఐ మేనేజ్‌మెంట్‌ సారథి బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై ఇప్పటికీ రోహిత్‌ అభిమానులు, మాజీ క్రికెటర్ల, కామెంటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంఐలో ఓపెనర్‌గా రోహిత్‌ కొనసాగుతున్నాడు.

వచ్చే ఏడాది మెగా ఐపీఎల్ వేలం జరగనుండగా, రోహిత్ ఎంఐతో ఉంటాడా? మరో ఫ్రాంచైజీకి వెళ్తాడా? అనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది హిట్‌మ్యాన్‌ ఏ కలర్‌ జెర్సీ ధరిస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.

Advertisment
తాజా కథనాలు