Pneumonia: చైనాలో నిమోనియా టెన్షన్.. అసలు ఇది ఎందుకు ప్రమాదకరం?

చైనాలో నిమోనియా తరహా కేసులు పెరుగుతున్నాయి. ఇది పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటె వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)

New Update
Pneumonia Cases: న్యూమోనియా కేసుల విజృంభణ..అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు..!!

China Pneumonia Outbreak: నిన్న మొన్నటి వరకూ కరోనా ఎఫెక్ట్ మనల్ని వదల్లేదు. చైనా నుంచి చిన్నగా మొదలై మొత్తం ప్రపంచాన్నే.. స్థంభించేలా చేసిన కరోనా పీడకల ఇంకా చెదిరిపోలేదు. తాజాగా కొత్తరకం నిమోనియా చైనాలో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది అంటూ వస్తున్న వార్తలు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి. చైనాలో విస్తరిస్తున్న ఈ అంతుచిక్కని న్యుమోనియాను ప్రపంచం మొత్తం గమనిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్వయంగా అప్రమత్తమై చైనా (China) నుంచి సమాచారం కోరింది. ఇది మారిన కరోనా రూపమా లేక కొత్త వైరస్ ఏదైనానా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది  పిల్లలను బాధితులుగా మారుస్తోంది. అందుకే దీన్ని మరింత ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు.  ప్రస్తుతం ఉత్తర చైనాలో కరోనా వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంది. ఈ ఇన్ఫెక్షన్ పెద్దగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అక్కడ స్కూల్స్ కు సెలవులు ప్రకటిస్తున్నారు. 

ఉత్తర చైనాలో ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ నవంబర్ 13న మీడియా సమావేశం నిర్వహించి తెలియజేసింది. ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వారిని ఆసుపత్రుల్లో చేర్పిస్తున్నారు. ఈ సమయంలో అధికారులు ఇన్ఫ్లూయెంజా కేసులు ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనికితోడు కోవిడ్-19 (Covid-19) కేసులు తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే,  గత రెండు మూడు రోజులుగా పిల్లల్లో నిమోనియా (Pneumonia) కేసులు అకస్మాత్తుగా పెరగడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆ తర్వాత నిమోనియా కేసులు పెరుగుతుండటంపై చైనా అధికారులు మాట్లాడారు. దీంతో అప్రమత్తమైన డబ్ల్యూహెచ్ వో దీనిపై పూర్తి సమాచారాన్ని చైనాను కోరింది.

నిమోనియా లక్షణాలు ఏమిటి?

చైనాలో వ్యాప్తి చెందుతున్న అంతుచిక్కని నిమోనియా లక్షణాలు కరోనాను (Corona) పోలి ఉంటాయి. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది బాధితుడి ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం.  న్యుమోనియాతో బాధపడుతున్న పిల్లలను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. కోవిడ్-19 ఆంక్షలను ఎత్తివేయడమే ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని చైనా అధికారులు చెబుతున్నారు. మైకోప్లాస్మా నిమోనియా పిల్లలను ప్రభావితం చేస్తుందని చైనా అధికారులు తెలిపారు.

ఈ నిమోనియా ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడానికి నిమోనియా కేసులు, కారణాలు - ప్రభావాలపై పూర్తి సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా చైనాను కోరింది. ఇది కోవిడ్ వలె అంటువ్యాధి అయితే, ఇది చైనా వెలుపల వ్యాప్తి చెందకుండా సాధ్యమైనంత త్వరగా నియంత్రించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తామని,  డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ కు చెందిన డాక్టర్ కృతికా కుప్పిలి ఈ వ్యాధి ఏదైనా కావొచ్చని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత చాలా దేశాల్లో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి పెరిగింది. అయితే, చైనాలో దీనికి కారణమేమిటో తెలుసుకోవడానికి మరింత సమాచారం అవసరం. డబ్ల్యూహెచ్ వో ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణులతో ప్రయోగశాలలో దీనికి సంబంధించిన  పరీక్షలు నిర్వహిస్తోంది.

Also Read: నిమోనియా మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చైనాకు డబ్ల్యూహెచ్వో ఆదేశం

డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు..

చైనాలో నిమోనియా వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పరిశుభ్రత పాటించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. పని లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానుకోమని సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళితే సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలి అని చెబుతున్నారు. 

ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయమా?

చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వ్యాధి ప్రపంచానికి ముప్పు కాదా అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా ఏమీ చెప్పలేదు.  కానీ డబ్ల్యూహెచ్ఓ ఈ విషయంలో పూర్తిగా చురుకుగా ఉంది. వాస్తవానికి 2019లో ఈ సీజన్లో చైనాలో కరోనా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అందుకే వీలైనంత త్వరగా కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ నిమోనియా వ్యాధికి కారణాన్ని కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నిస్తోంది.

2019లో కూడా.. .

చైనాలో అంతుచిక్కని నిమోనియా 2019లో కూడా దాడి చేసింది. ఆ సమయంలో చైనాలోని వుహాన్ ఫ్రావిన్స్ లో  ఇది మొదట బయటపడింది. డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కూడా బాధితుల్లో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తదితర లక్షణాలు కనిపించాయి. అయితే, దీనిని సకాలంలో నియంత్రణలోకి తీసుకురాగలిగారు. 

ఏదిఏమైనా.. ఇప్పుడు చైనా పరిస్థితి తెలిసిన తరువాత అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ సామాజిక దూరం.. మాస్క్ లు ధరించడం వంటి నివారణ చర్యలు తీసుకోవడం మంచిది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు