Online Betting: కుటుంబాన్ని బలితీసుకున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆన్ లైన్ గేమ్స్ కారణంగా ఓ కుటుంబం బలైంది. నల్లగొండకు చెందిన ఆనంద్‌, ఇందిర.. మూడేళ్ల బాబుకు విషమిచ్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆనంద్‌ పాల వ్యాపారం, ఇందిర ఓ సంస్థలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది.

New Update
Online Betting: కుటుంబాన్ని బలితీసుకున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌!

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు.. ఆన్ లైన్ గేమ్స్ కారణంగా తలెత్తిన గొడవలు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. ముద్దులొలికే మూడే ళ్ల బాబుకు విషమిచ్చి చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని సన్‌సిటీలో సోమవారం ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆనంద్‌(38)కు చేవెళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన ఇందిర(38)తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమారుడు శ్రేయాన్స్‌(3) ఉన్నాడు. బతుకుదెరువు కోసం నగరానికొచ్చి బండ్లగూడ సన్‌సిటీలోని యమునా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు.

ఆర్థిక సమస్యలు చుట్టిముట్టి..
ఆనంద్‌ పాల వ్యాపారం చేస్తుండగా, ఇందిర ఓ సంస్థలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. వీరికి ఆర్థిక సమస్యలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటాన్ని ఇందిర బావ, చేవెళ్ల మల్కాపురంలో ఉంటున్న నగేశ్‌ గుర్తించాడు. ఈ విషయమై వారం క్రితం ఆయన సన్‌సిటీకొచ్చి ఆనంద్‌కు, ఇందిరకు సర్దిచెప్పాడు. ఇందిరకు తల్లిదండ్రులు లేరని, తాను అప్పుడప్పుడూ వచ్చి దంపతుల బాగోగులు చూసేవాడినని నగేశ్‌ చెప్పాడు.

ఉగాదికి ఊరికి రండి అని చెప్పి..
ఆనంద్ కొంతకాలం పాలవ్యాపారం చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడిన ఆనంద్.. తరచూ డబ్బులు పోగొట్టుకునేవాడు. దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి ఇందిర బంగారంతో పాటు కారును కూడా అమ్మేశాడు. ఫ్లాట్‌ను కూడా అమ్మేందుకు సిద్ధమవడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. వారం క్రితమే వచ్చి ఉగాదికి ఊరికి రండి అని చెప్పినట్లు, సోమవారం వచ్చి తానే తీసుకెళ్తానని చెప్పినట్లు వెల్లడించాడు. సోమవారం సాయంత్రం ఆనంద్‌ తనకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడని, ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్విచాప్‌ వచ్చిందని చెప్పాడు. తాను సన్‌సిటీకి వచ్చి చూసేసరికి ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడి..
15 రోజుల నుంచి ఆనంద్‌, ఇందిర గొడవ పడుతున్నారని, పలుమార్లు వారి బందువులొచ్చి నచ్చచెప్పి వెళ్లారని వాచ్‌మన్‌ వెంకటయ్య చెప్పాడు. కాగా ఆనంద్‌ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల పాలైనట్లు భావిస్తున్నారు. అయితే ఇంట్లో ఇందిర మృతదేహం ఓ గదిలో.. ఆనంద్‌, శ్రేయాన్స్‌ మృతదేహాలు మరో గదిలో కనిపించాయి. ఆనంద్‌, శ్రేయాన్స్‌ నోట్లోంచి నురుగులు వచ్చాయి. శ్రేయాన్స్‌కు విషమిచ్చి.. ఆ తర్వాత ఆనంద్‌ విషం తాగి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఇందిర ఎలా ఆత్మహత్య చేసుకుందనేది తెలియాల్సి ఉంది. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నట్లు రాజేంద్రనగర్‌ ఏసీపీ టి.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు