ఉత్తరప్రదేశ్లో ఓ దారణమైన ఘటన 30 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కొడుకులు కన్నతండ్రినే హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. మూడో కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ ప్రదేశంలో తవ్వకాలు జరపగా నిజంగానే లోపల ఓ మానవ అస్థిపంజరం దొరికింది.
Also Read: ఉరికంబంపై ఉన్నప్పుడు భగత్ సింగ్ ఏమన్నాడో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని హథ్రస్కు చెందిన బుధ్ సింగ్ అనే వ్యక్తి 1994 నుంచి కనిపించడం లేదు. అతని కుమారుడు పంజాబీ సింగ్ ఇటీవలే స్థానిక కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. అతని ఇద్దరు సోదరులు మరో వ్యక్తితో కలిసి తండ్రిని చంపేశారని.. ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టారని ఆరోపణలు చేశాడు. అప్పుడు తన వయసు తొమ్మిదేళ్లు మాత్రమేనని పేర్కొన్నాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఆ ఇంట్లో తవ్వకాలు చేపట్టగా మానవ అస్థిపంజరం లభ్యమైంది. దానికి పోస్టుమార్టంతో పాటు డీఎన్ఏ టెస్టుకు తరలించారు.
ఇదిలాఉండగా బుధ్సింగ్ అనే వ్యక్తికి నలుగురు కొడుకులు. అయితే ఈ మధ్య సోదరుల మధ్య గోడవలు జరిగాయి. దీంతో 30 ఏళ్ల క్రితం తండ్రికి, తన అన్నయ్యలకు మధ్య జరిగిన గొడవ మూడో కొడుకు పంజాబీ సింగ్కు గుర్తుకొచ్చింది. ఈ విషయాలు మాట్లాడటంతో ఆ ఇద్దరు సోదరులు పంజాబీ సింగ్ను బెదిరించారు. దీంతో సింగ్ తన తండ్రి అదృశ్యమవ్వడానికి వారే కారణమని ఆరోపించాడు. తన ఇద్దరు సోదరులపై ఫిర్యాదు చేయడంతో ఇంటి ప్రాంగణంలో తవ్వకాలు జరపగా అస్థిపంజరం లభ్యమైంది. దాని డీఎన్ఏ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.