/rtv/media/media_files/YFv7VDPvgSdEQFlvR7WA.jpg)
దేశ వ్యాప్తంగా పలు ప్రార్థనా స్థలాల్లో సర్వేలు జరుగుతున్నాయి. ఇవి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. దాంతో పాటూ ఈ సర్వేల మీద పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటి మీద విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు తీసుకోరాదని స్పష్టం చేసింది.
పిటిషన్లు దాఖలు చేసిన పలువురు నేతలు..
1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ప్రార్ధనా స్థలాల సర్వేల మీద ఈయన ఒక్కరే కాదు..పలు పార్టీలకు చెందిన నేతలు జితేంద్ర అహ్వాద్, శరద్పవార్, మనోజ్ కుమార్ ఝా లాంటి వారు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై కేంద్రం నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల్లో ఎలాంటి తీర్పులు, ఉత్తర్వులు హైకోర్టులు ఇవ్వకూడదని కూడా ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా , జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం స్పందన వచ్చే వరకూ ఓపిక పట్టాలని చెప్పింది.
Also Read: కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా..మోహన్ బాబు మరో ఆడియో