/rtv/media/media_files/2025/09/18/cm-nitish-kumar-2025-09-18-12-55-12.jpg)
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను రాజ్యసభకు పంపేందుకు తెర వెనుక పావులు కదులుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం JDU, BJP అగ్ర నాయకత్వాల మధ్య జరుగుతున్న చర్చలు ఈ సంకేతాలను బలపరుస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, బీహార్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
రాజ్యసభకు నితీష్.. ఎందుకు?
వరుసగా బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. కేంద్రంలో NDA కూటమి బలోపేతానికి ఆయన అనుభవం అవసరమని బీజేపీ భావిస్తోంది. 2026లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన్ని పార్లమెంటుకు పంపి, కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బీహార్లో ఈ రాజకీయ సమీకరణాలు మారితే, అది కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా 2029 సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుంది. జేడీయూ క్యాడర్ ఈ మార్పును ఎలా స్వీకరిస్తుంది? నితీష్ కుమార్ తన పట్టును జాతీయ స్థాయిలో ఎలా చాటుకుంటారు? అనేది వేచి చూడాలి.
బీజేపీకి కలిసొచ్చే అంశం
నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్తే, బీహార్ ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. గతంలో అనేకసార్లు నితీష్ కోసం ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న బీజేపీ, ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రాష్ట్రంలో అత్యధిక బలం ఉన్నందున, తమ పార్టీకి చెందిన నేతనే ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ పట్టుబడుతోంది. నితీష్ వారసత్వ ప్రణాళికలో భాగంగా బీజేపీకి అధికారం అప్పగించి కూటమిలో ఐక్యతను చాటాలని ఇరు పార్టీలు ఆలోచిస్తున్నాయి.
వారసత్వ పోరు
నితీష్ ఢిల్లీ పర్యటనలు, బీజేపీ అగ్రనేతలతో ఆయన జరుపుతున్న భేటీలు కేవలం మర్యాదపూర్వకమైనవి కావని, ఇవి అధికార మార్పిడికి సంబంధించిన 'మేధోమథనం' అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ నితీష్ రాజ్యసభకు వెళ్తే, బీహార్లో బీజేపీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Follow Us