/rtv/media/media_files/2025/10/20/tvk-2025-10-20-10-13-49.jpg)
తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కరూర్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మందికి గౌరవ సూచకంగా ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవద్దని పార్టీ కార్యకర్తలకు, నాయకులను ఆయన కోరారు. ఈ విషాదంలో మరణించిన వారంతా టీవీకే కుటుంబ సభ్యులే కాబట్టి, వారి మృతికి సంతాప సూచకంగా పార్టీ తరఫున ఎలాంటి దీపావళి వేడుకలు, సంబరాలు నిర్వహించకూడదని విజయ్ ఆదేశించారు.కార్యకర్తలు తమ వ్యక్తిగత స్థాయిలో శుభాకాంక్షలు తెలుపుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ, పార్టీ పేరును, జెండాను ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టర్లు, బ్యానర్లు పెట్టకూడదని స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్. ఆనంద్ ఈ ఆదేశాలను జిల్లా స్థాయి నాయకులకు మౌఖికంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం ఆ విషాదంలో మరణించిన వారికి పార్టీ తరఫున ఇచ్చే నివాళిగా, బాధ్యతగా భావిస్తున్నట్లు టీవీకే నేతలు తెలిపారు. అయితే, పార్టీతో సంబంధం లేకుండా, ఆఫీసు బేరర్లు వ్యక్తిగత హోదాలో వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేయడానికి విజయ్ అనుమతి ఇచ్చారు.
ఎక్కువ మంది జనం రావడంతో
సెప్టెంబర్ 27న కరూర్ వేలుచామిపురంలో విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఈ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట జరిగి, 41 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు విజయ్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి చెందిన ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్పై కూడా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. అలాగే ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏక సభ్య కమీషన్ ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.