మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయంతో మహా వికాస్ అఘాడీ (MVA) కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. MVAను ఉద్ధవ్ థాకరే వీడబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కూటమిని వీడాలంటూ పార్టీ నేతలు ఉద్ధవ్పై ఒత్తిడి తేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే బృహణ్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామంటూ ఉద్ధవ్కు నేతలు సలహా ఇస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. కూటమిని వీడుతున్నారన్న ప్రచారంపై ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఏం చేయాలో మాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం
46 సీట్లకే పరిమితమైన MVA..
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 సీట్లకు గానూ మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 46 సీట్లకే పరిమితమైంది. కూటమిలో ఉద్ధవ్ శివసేనకే అత్యధికంగా 20 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 16, శరద్ పవార్ NCPకి 10 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తానో లేదా షిండే ఎవరో ఒకరే రాజకీయంగా మిగలాలని ఉద్దవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీని మళ్లీ ఎలా పట్టాలు ఎక్కించాలి? పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి? అన్న అంశంపై ఉద్ధవ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం తమ కోర్ ఓటర్లకు పెద్దగా నచ్చలేదని శివసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ కూటమి నుంచి బయటకు వచ్చి సొంతంగా పోరాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీని చంపుతామంటూ.. ముంబాయి పోలీసులకు బెదిరింపు కాల్స్..
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి ఆరు రోజులు అవుతున్నా.. ఇంకా ముఖ్యమంత్రి ఎవరన్న అంశం తేలలేదు. అయితే.. ఫడ్నవీస్ సీఎం కావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. షిండే కూడా అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి ఫడ్నవీస్ పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.