/rtv/media/media_files/2025/05/07/H6aVsNYO07rEiWMY2Jcp.jpg)
ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయకపు టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన చర్యలో విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. అయితే ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
జమ్మూకశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందనే కుట్ర పన్ని దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారని విక్రమ్ మిస్రీ అన్నారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణహోమానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయిందని.. పహల్గాం దాడిపై దర్యాప్తు చేపట్టగా దీని వెనుక పాక్ హస్తం ఉన్నట్లు బయటపడిందని తెలిపారు.
NOW: Briefing on #OperationSindoor
— TIMES NOW (@TimesNow) May 7, 2025
Ahead of the press briefing, the government releases a video highlighting past terror attacks on India, including the Pahalgam terror attack.
Watch LIVE: https://t.co/01G4Ar9gvW pic.twitter.com/TuuAKcLNnu
ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా
ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని విక్రమ్ మిస్రీ అన్నారు. పహల్గాం దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని.. టీఆర్ఎఫ్కు పాక్ అండదండలున్నాయని వెల్లడించారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్పై ఇప్పటికే నిషేధం ఉందని .. ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టీఆర్ఎఫ్ పేరుతో ఆయా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పుకొచ్చారు. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు రావడంతోనే ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని మిస్రీ స్పష్టం చేశారు.
పహల్గాం దాడికి ప్రతికారంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని విక్రమ్ మిస్రీ తెలిపారు. మా లక్ష్యం ఉగ్రస్థావరాలే అని వాటిని మాత్రమే ధ్వంసం చేశామని వెల్లడించారు. పాక్ పౌర నివాసాలపై ఎలాంటి దాడులు చేయలేదని.. ఏ ఒక్క పాక్ పౌరుడికి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పాక్ లోని సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా.. కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లుగా తెలిపారు. ఆయా స్థావరాల వివరాలను వెల్లడించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంట్ పై దాడి, ముంబైలో కాల్పులు దాడి, 2019లో పుల్వామాలో సైనికులపై దాడి వరకు గతంలో భారత్ లో జరిగిన ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ దాడుల వలన ఇప్పటివరకు పాక్ ఉగ్రదాడుల్లో 350 మంది భారత పౌరులు మృతి చెందారని వెల్లడించారు.