అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్లకే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ఉండగా అందులో 241 మంది మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకరు మాత్రమే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై కేంద్రం సీరియస్ గా తీసుకుంది. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
అమెరికా సంస్థలతో చర్చ
ముందుగా తాత్కాలికంగా సేవలు నిలిపివేసి.. భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చేయాలా? కొనసాగించాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సేఫ్టీ రివ్యూ కోసం 787 - 8 ఫ్లీట్ను గ్రౌండింగ్ చేయాలని నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై అమెరికా సంస్థలతో కేంద్రం చర్చిస్తోంది. ఎయిర్ఇండియా ఆపరేటింగ్ విధానంపైనా కూడా కేంద్రం సమీక్ష నిర్వహిస్తుంది.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు గురువారం తెలిపారు. కాగా బోయింగ్ 787 సిరీస్లో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి, బోయింగ్ 787-8 అతి చిన్నది. 787-8 విమానం 248 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు అంతేకాకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల 787-9 విమానం 296 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. ఈ మూడింటిలో అతి చిన్న దూరం కలిగిన 787-10 విమానం 336 మందితో ప్రయాణించగలదు.