/rtv/media/media_files/2025/09/03/looti-2025-09-03-14-21-45.jpg)
Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లుటి జలాశయం కూలిపోవడంతో, వరదనీరు సమీపంలోని గ్రామాల్లోకి ఉప్పెనలా దూసుకువచ్చింది. ఈ విషాద ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
Balrampur, Chhattisgarh: A sudden collapse of the 40-year-old Luti dam in Balrampur, triggers flooding, major devastation, multiple deaths, and missing persons. Rescue operations are ongoing, with administration and NDRF teams present on site pic.twitter.com/ZhKcvL2oOr
— IANS (@ians_india) September 3, 2025
బలరాంపూర్ జిల్లాలోని ధనేష్పూర్ గ్రామంలోని లుటి జలాశయం కూలిపోవడంతో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతులలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, మరో వృద్ధుడు ఉన్నారని తెలుస్తోంది. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వరదలో కొట్టుకుపోయిన మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
1980ల ప్రారంభంలో నిర్మించిన ఈ జలాశయం, భారీ వర్షాల కారణంగా వరద ఉధృతిని తట్టుకోలేక కూలిపోయింది. దీనితో సమీపంలోని ఇళ్ళు, వ్యవసాయ భూములు నీట మునిగాయి. ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల సీఎం బస్తర్ డివిజన్లోని వరద ప్రభావిత ప్రాంతాలను కూడా సందర్శించారు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఛత్తీస్గఢ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వివిధ ప్రాంతాల్లో వరదలు సంభవించి మొత్తం ఎనిమిది మంది మరణించారని, 96 పశువులు చనిపోయాయని అధికారులు వెల్లడించారు. అలాగే, దాదాపు 495 ఇళ్లు, 16 కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. దంతేవాడలోని సహాయ శిబిరాలను ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించి, ప్రజలను పరామర్శించారు. ప్రభుత్వం వరద బాధితులకు తగిన సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ సంఘటనపై మరింత సమాచారం కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.