/rtv/media/media_files/2025/02/06/pqcbi58M8vuEmCz7gpxM.jpg)
govt teacher
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై ఆర్థిక నేరాల విభాగం (EOW) బృందం దాడులు నిర్వహించింది. మధ్యప్రదేశ్ లోని శివపురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివపురికి బుధవారం తెల్లవారుజామున భారీ పోలీసు బలగాలతో వచ్చిన ఈ బృందం ఇంటిలోని ప్రతి అంగుళాన్ని సోదా చేసింది. ఇన్స్పెక్టర్ జై సింగ్ యాదవ్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది.
ఉపాధ్యాయుడు సురేష్ భడోరియా వద్ద రూ.8 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నట్లు తేల్చింది. ప్రస్తుతం నెలకు రూ. 65 వేల జీతం పొందుతున్న సురేష్ సింగ్ భదౌరియా 1998 నుండి ఈ ఉద్యోగంలో ఉన్నారు. ఈవోడబ్ల్యూ నిర్వహించిన ఈ దాడిలో సురేష్ భడోరియాకు రూ. కోటి 70 లక్షల విలువైన ఒక ఇల్లు, 11 దుకాణాలున్నాయి. దీనితో పాటుగా పిచోర్ రోడ్డులో రూ. కోటి విలువైన 10 దుకాణాలు ఉన్నాయి. ఉపాధ్యాయుడి ఇంట్లో రూ. 5 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రీలు కూడా బయటపడ్డాయి. అలాగే, రూ. 4 లక్షల 71 వేల370 డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, బంగారం, వెండి కూడా బయటపడ్డాయి.
చట్టబద్ధమైన ఆదాయం కంటే
అతని వద్ద చట్టబద్ధమైన ప్రభుత్వ ఆదాయం కంటే 7 కోట్ల 98 లక్షల 28 వేల 340 రూపాయలు ఎక్కువని అధికారులు తేల్చారు. దీనిపై ఈవోడబ్ల్యూ అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఉపాధ్యాయుడు సురేష్ సింగ్ భడోరియా భిండ్ జిల్లాకు చెందినవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన భోంటిలో స్థిరపడ్డారు. ఉపాధ్యాయుడిగా మారడానికి ముందు భడోరియా ఓ రేషన్ దుకాణం నడిపేవాడు. అతనిపై హరిజన్ చట్టం కింద అర డజనుకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భోంటి పోలీస్ స్టేషన్ కు చెందిన భూమిని కూడా భడోరియా తనదేనని చెబుతూ దానిని స్వాధీనం చేసుకున్నాడని అతనిపై కోర్టులో కేసు నడుస్తోంది.
Also Read : శ్మశానవాటికలో బీజేపీ లీడర్.. బిచ్చం ఎత్తుకునే వరకు తీసుకొచ్చిన రాజకీయాలు