Delhi High Court : రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్పై ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్, నర్సింగ్ ఆస్పత్రిలోనూ ఉచితంగా వైద్యం అందిచాలని చెప్పింది. దీనిని నిరాకరిస్తే చట్టరీత్యా నేరమని తెలిపింది. ఆ సందర్భంలో చట్టపరమైన అనుమతులు పట్టించుకోకుండా.. బాధితుల పరిస్థితిని బట్టి వైద్యం అందించాలని వెల్లడించింది. ఉచితంగా చికిత్స చేయడానికి నిరాకరించిన డాక్టర్లు, ఆస్పత్రి మేనేజ్మెంట్పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాల సిఫార్సు అవసరం లేదు: ఈ మేరకు జస్టిస్ ప్రతిభా సింగ్, జస్టిస్ అమిత్ శర్మతో డివిజన్ బెంచ్ ఓ కేసులో ఈ తీర్పును ఇచ్చారు. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు అత్యవసరంగా వైద్యం అందించాలి. వాళ్లకు సరైన టైంలో ఉచిత వైద్యం అందడం లేదని బెంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ఉచిత చికిత్స అందించేందుకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సు అవసరం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 357సీ, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 397 కింద కల్పించిన చట్టబద్ధమైన హక్కు బాధితులకు వర్తిస్తుందని పేర్కొంది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ఎలాంటి మెడికల్ ఫెసిలిటీలో అయినా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్లో ఉచిత చికిత్స అందించాలి. అంతేకాదు ప్రాథమిక ట్రిట్మెంట్ మాత్రమే చేసి పంపకూడదు. రోగికి అవసరమైన టెస్టులు చేసి.. అవసరమైతే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలి. ఏదైనా ఆపరేషన్ అవసరమైతే చేయాలి. రోగికి, బాధితుల ఫ్యామిలీకి ఫిజికల్, మెంటల్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. వాళ్లకు మానసికంగా భరోసా కల్పించాలని తీర్పులో వెల్లడించింది. అన్ని ఆస్పత్రుల్లో బోర్డులు: ఈ వైద్య సదుపాయాలకు సంబంధించి అన్ని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టాలని కోర్టు తీర్పులో పేర్కొంది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ఉచిత వైద్యం అందిస్తామంటూ ఆస్పత్రుల ఎంట్రెన్స్, రిసెప్షన్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లైంగిక దాడుల కేసులను విచారించే కోర్టులకు పంపించాలని సూచించింది. క్రిమినల్, పోక్సో, ఫ్యామిలీ కోర్టులకు తీర్పు కాపీలను పంపాలి. ఈ కేసులు విచారించే కోర్టులు బాధితులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇది కూడా చదవండి: ఉదయం వీటిని నానబెట్టి తింటే త్వరగా బరువు తగ్గొచ్చు