Andhra Pradesh: వారికి వెంటనే జీతాలు చెల్లించాలి.. లోకేష్ కీలక ఆదేశాలు

వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో ఆయాలు, వాచ్‌మెన్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
Andhra Pradesh: వారికి వెంటనే జీతాలు చెల్లించాలి.. లోకేష్ కీలక ఆదేశాలు

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లి నివాసంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ''పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సీబీఎస్ఈ సిలబస్ అమలవుతున్న వెయ్యి పాఠశాలల్లో అసెస్‌మెంట్ టెస్ట్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన ఫలితాలు వచ్చాక విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మండల స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఆ తర్వాత డివిజన్ స్థాయిలో చేపట్టాలి. సర్దుబాటు ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాం. సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలి. నవంబర్‌లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి.

Also Read: ఏపీలో నైపుణ్య గణన సర్వే.. నారా లోకేష్ కీలక ఆదేశాలు

అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించాలి. విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలి. పాఠశాల విద్య శాఖను పట్టిపీడిస్తున్న కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన యాప్‌ల భారాన్ని టీచర్లకు తప్పించాం. గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలు అప్పగించాం. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలూ కూడా ఇందులో భాగస్వామ్యమై పర్యవేక్షణ చెయాలి. పాఠశాలల్లో ఆయాలు, వాచ్‌మెన్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. లెర్నింగ్స్ అవుట్‌కమ్స్‌పై సమీక్షిస్తూ విద్యా సామర్థ్యాల మెరుగుదలకు పకడ్బందీగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని'' మంత్రి లోకేష్ సూచనలు చేశారు.

అలాగే అనకాపల్లి అనాథ శరణాలయంలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై లోకేష్ విచారం వ్యక్తంచేశారు. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏజెన్సీ స్కూళ్లతో పాటు ప్రైవేట్ వ్యక్తులు నడిపే ఆశ్రమాలు కూడా నిరంతరం ట్రాక్ చేస్తూ పర్యవేక్షించాలన్నారు. పాఠశాలల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్ ప్రశ్నాపత్రాలు ఏ స్థాయిలో లీకైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ పదోన్నతులు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై కూడా లోకేశ్ సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!

Advertisment
తాజా కథనాలు