మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే గట్టి పోటి ఉండనుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య మాత్రమే పోటీ అని.. వ్యక్తుల మధ్య కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించకముందు కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లు అవకాశం ఇస్తే వాళ్లు ఏం చేశారంటూ ప్రశ్నించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు కోసం పొలాల వద్ద రైతులు రాత్రికి పడుకునే పరిస్థితులు ఉండేవని అన్నారు.
Also read: ఢిల్లీలో అధికారంలోకి రాగానే తొలిసంతకం దానిపైనే పెడతాం: రాహుల్
అలాంటి పరిపాలన మనకొద్దని.. అసలు కాంగ్రెస్ వాళ్లకు వ్యవసాయం గురించే తెలియదని విమర్శించారు. అందుకే ఇటీవల రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలని అంటున్నారని చురకలంటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తికి తాము గోదావరి నీళ్లు తీసుకొచ్చామని.. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. కులం, మతం అనే భావనలు చూపించకుండా.. మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు.
Also read: పీఎం పర్యటనలో బయటపడ్డ భద్రతా లోపం..కాన్వాయ్ కు అడ్డొచ్చిన మహిళ…!!