Konda Surekha: నాడు అన్నకు అండగా.. నేడు చెల్లెలికి తోడుగా.. ఏపీలో ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అన్నగా భావించే వైఎస్సార్ కొడుకు జగన్ వెంట నడిచిన ఆమె, ఇప్పుడు షర్మిల నేతృత్వంలో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామంటున్నారు. అక్కడ ప్రచారానికి సిద్ధమని స్పష్టంచేశారు.

New Update
Konda Surekha: నాడు అన్నకు అండగా.. నేడు చెల్లెలికి తోడుగా.. ఏపీలో ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ

Konda Surekha: మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ (AP Congress) తరఫున ప్రచారానికి సిద్ధమని ప్రకటించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలు రాగానే ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ను (CM Jagan) ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. షర్మిల (YS Sharmila) సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని విమర్శించారు. ప్రజలు ఛీ కొట్టినా వారికి బుద్ధి రాలేదంటూ దుయ్యబట్టారు. ఫూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ లపై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీసీని నియమించాలని సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ ఎన్నికల్లో ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.

ఎందుకింత గ్యాప్‌!
వైఎస్సార్‌ (YSR) మరణానంతరం జగన్‌తో నిలిచిన కొందరు తొలి నాయకుల్లో కొండా సురేఖ, కొండా మురళి ముఖ్యులు. అప్పుడు కొండా సురేఖ మంత్రి పదవిని సైతం వదిలేసి జగన్‌ వెంట నడిచారు. తెలంగాణ రాష్ట్రోద్యమ ఉధృతి కొనసాగుతున్న వేళ రాజుకున్న మానుకోట ఘటనలో కూడా తాను అన్నగా భావించే వైఎస్సార్‌ కొడుకు జగన్‌ పక్షమే నిలిచిన విషయం తెలిసిందే. అయితే అంత ఆత్మీయంగా కొనసాగిన వారి మధ్య తర్వాతి కాలంలో అసాధారణమైన అంతరం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: ఆపరేషన్‌ ఏపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్? బీజేపీ స్ట్రాటజీ ఇదేనా?

ఈ స్థాయి అసంతృప్తికి కారణమేమిటన్న విషయమై రకరకాల ప్రచారాలున్నాయి. అయితే, ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వారే కొన్ని విషయాలు వెల్లడించారు. జగన్‌ది వక్రబుద్ధి అంటూ విమర్శించారు. సీఎం అయ్యాక కనీసం ఫోన్‌ చేసి పలకరించలేదని, అలా చేసి ఉంటే చాలా సంతోషించేవారిమని సురేఖ చెప్పారు. తన సెక్యూరిటీ సమస్య నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరితే కాదన్నాడని మురళి చెప్పారు. ఒకే కుటుంబానికి మూడు పదవులు ఎలా ఇస్తారని, అడగడానికి హద్దుండాలని అంటూ లేఖ రాసి పంపారని సురేఖ వివరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వెళ్తే కనీసం స్థానిక అధికారులు కూడా తమ కార్యక్రమానికి రాకుండా జగన్‌ నిలువరించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మొత్తానికి చాలారోజుల తర్వాత మళ్లీ ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు మంత్రి కొండా సురేఖ (Konda Surekha). ఏపీలో వైఎస్‌ షర్మిల సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెస్తామని ధీమావ్యక్తంచేశారు.

Advertisment
తాజా కథనాలు