Harish Rao : భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థితో జాగ్రత్త.. ఏకంగా రాహుల్ గాంధీ సంతకాన్నే ఫోర్జరీ: హరీశ్ రావు సంచలనం

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరించబడ్డాడని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత అని, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనను పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు.

New Update
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు.. హరీష్ రావు ఫైర్

Harish Rao : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్(Congress) అభ్యర్థి రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరింపబడిన వ్యక్తి అని బీఆర్ఎస్(BRS) నేత హరీశ్ రావు ఆరోపించారు. అతనితో జాగ్రత్తగా ఉండాలని ఓటర్లను కోరారు. ఈ రోజు నిర్వహించిన భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) సన్నాహక కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. 2014లో పార్టీని, లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో గెలిపించుకున్న స్ఫూర్తితో ఈ 2024లోనూ గెలిపించాలని కోరారు. నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో గెలుస్తామన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు. ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, పట్నం సునీతలు పార్టీ మారడాన్ని ప్రజలు హర్షించడం లేదు. స్వార్థపరులే పార్టీలు మారుతున్నారని ధ్వజమెత్తారు. వారిని ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారన్నారు. భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత అని, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనను పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: MLA Harish Rao: వెంటనే రుణమాఫీ చేయాలి.. సీఎం రేవంత్‌కు హరీష్ లేఖ

కాంగ్రెస్ నేతలు వందరోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనకు వందరోజులు నిండాకే కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారంటీల్లో తొలి హామీ మహిళలకు రూ.2500నే అమలు చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు 500 బోనస్, 4 వేల ఫింఛన్, 15 వేల రైతుబంధు, తులం బంగారం, 4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు 5 లక్షల బ్యాంకు కార్డు, వీటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఫైర్ అయ్యారు. మాట తప్పిన కాంగ్రెస్‌కు ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగులకు 4 వేలు ఇస్తామని రేవంత్ చెప్పిండని.. ప్రియాంకా గాంధీ ఈ భువనగిరిలోనే హామీ ఇచ్చిందన్నారు. కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పారని ఫైర్ అయ్యారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ప్రజలను మోసం చేసినా తమకే ఓటేశారని ప్రచారం చేసుకుంటారన్నారు. తాము అసెంబ్లీలో ప్రశ్నించడానికి వీలుండదన్నారు. బీజేపీ కూడా ఒక్క హామీని కూడా నిలెబెట్టుకోలేదన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరలను భారీగా పెంచిందన్నారు. నల్లధనం తేలేదు, 2 కోట్ల ఉద్యోగాలివ్వలేదన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం కాదు, ప్రజలకు చేసిన మేలేంటో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే మన క్యామ మల్లేష్‌ను గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండి.. కేసీఆర్‌లా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నంతకాలం.. భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటుందన్నారు హరీశ్ రావు.

Advertisment
తాజా కథనాలు