Gutta Sukhender Reddy: ఎంపీ వెంకట్‌రెడ్డిపై గుత్తా ఫైర్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పాలిటిక్స్‌ పీక్స్ లెవల్‌కు వెళ్లాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌లో అవినీతి ఎక్కువైపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించగా.. ఎంపీ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే మంచి సమయమని గుత్తా ఎద్దేవా చేశారు.

New Update
Gutta Sukhender Reddy: ఎంపీ వెంకట్‌రెడ్డిపై గుత్తా ఫైర్

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎలాంటి సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టెండర్ల ద్వారానే గంధమల్ల రిజర్వాయర్‌ పనులు వచ్చాయని, భూ సేకరణ వల్ల ఆ పనులు ఆలస్యం అయ్యాయని వెల్లడిచారు. ఎలాంటి పదవి వద్దంటున్న కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదని, అందుకు ఇదే సరైన సమయమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్దంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు గాలి మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మభ్యపెడుతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నలుగురు నేతలు తామంటే తాము పీసీసీ చీఫ్‌లంటూ కొట్టుకుంటున్నారని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో పీసీసీ ఒక మాట చెబితే మరోనేత వ్యాఖ్యలు దానికి విరుద్దంగా ఉంటాయన్నారు. ఆ పార్టీలోని నేతల్లోనే ఐక్యతలేదన్న గుత్తా.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న 2 లక్షల రూపాయల రుణామాఫీ అసాధ్యమన్నారు. ప్రజలను తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ సాధ్యం కాని హామీలను ఇస్తుందన్న ఆయన.. వాటిని ప్రజలు గమనించాలని సూచించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ లోపే పూర్తవుతుందన్నారు.

కోమటిరెడ్డి ఏమన్నాడంటే.!

బుధవారం భువనగిరిలో పార్టీ శ్రేణులతో సమావేశమైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సీఎం కేసీఆర్ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్‌ పనులు అప్పగించారని ఆరోపించారు. తన కొడుక్కు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించేందుకు తన టికెట్‌ను త్యాగం చేశారన్నారు. అంతే కాకుండా ఏదోదేశాన్ని ఉద్దరించినట్లు తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని, టికెట్‌ ఎవరికి ఇచ్చిన తన మద్దతు ఉంటుందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ విషయం స్వయాన రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ చెప్పారని గుర్తు చేశారు. తమ పార్టీలో కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఉంటే పార్టీని వీడాలన్నారు. సొంతపార్టీ నేతలైనా ప్రజలను బెదిరింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతోందని, దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి చేస్తున్న రాజకీయ డ్రామాల గురించి ప్రజలకు అర్ధమైందన్నారు.

Advertisment
తాజా కథనాలు