Pawan Kalyan: పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. ఆయన వేసే ప్రతీ అడుగు ఓ సెన్షేషన్.. అయితే రాజకీయాలు, సినిమాలకు ముందు చిన్నతనంలో పవన్ అనుభవించిన బాధల గురించి కొంతమందికే తెలుసు. పవన్ స్కూలింగ్ టైమ్లో ఆయన ఆస్థమ బారిన పడ్డారు. ఇక ఆయనకు ఫ్రెండ్స్ కూడా తక్కువగా ఉండేవారు. మరోవైపు పరీక్షల ఒత్తిడి.. ఇలా అన్నీ ఒకేసారి రావడం పవన్ను డిప్రెషన్లోకి నెట్టేశాయి. ఈ డిప్రెషన్లోనే పవన్కు సూసైడ్ థాట్స్ వచ్చాయట. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన పవన్ ఆ తర్వాత ఎంతో ఉన్నతమైన మనసత్తత్వం కలిగిన వ్యక్తిగా ఎదిగారు.
1971 సెప్టెంబర్ 2న పవన్ బాపట్లలో పుట్టారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోతే మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. 1996లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిశారు. అన్నయ్య చిరంజీవి సపోర్ట్తోనే పవన్ సినీ అరంగ్రేటం జరిగినా ఆయన కష్టం మాత్రం ఎవరికీ తీసిపోనిది. తొలి సినిమాలో ఓ సీన్ కోసం చేతులపై కారు టైర్లు ఎక్కించుకున్నారు పవన్. తన సొంత టాలెంట్తో తక్కువ సమయంలోనే యాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు.. పవన్ స్టార్గా టాలీవుడ్ సినీ లవర్స్ మనసును దోచుకున్నారు.
2008, 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ చేసిన ప్రచారం ఇప్పటికీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఆయన ఆవేశపూరీత ప్రసంగాలు జనాల్లోకి దూసుకెళ్లాయి. నాటి సీఎం, ప్రతిపక్ష నాయకులపై పదునైన మాటలతో పవన్ ఎన్నో ప్రసంగాలు చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం 18 అసెంబ్లీ స్థానాలకే పరిమిమైంది. 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అన్నయ్య తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్.. 2014లో సొంతంగా జనసేన పార్టీతో ప్రజల ముందుకొచ్చారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమీకి అండగా నిలిచిన పవన్ వారి విజయంలో కీలక పాత్ర పోషించారు. 2016లో స్పెషల్ స్టెటస్ విషయంలో బీజేపీతో విభేదించిన పవన్ టీడీపీ-బీజేపీ కూటమికి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. స్పెషల్ స్టెటస్కు బదులుగా స్పెషల్ ప్యాకేజీని బీజేపీ ఇవ్వడాన్ని తప్పుబట్టిన పవన్ నాడు ఈ నిర్ణయాన్ని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. 2019లో కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగిన జనసేన 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క సీటే గెలుచుకుంది. గాజువాక, భీమవరం నుంచి పోటి చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయారు.
2019 ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్లకు పవన్ మళ్లీ బీజేపీతో జత కట్టారు. ఇక 2023లో చంద్రబాబు పార్టీకి సపోర్ట్గా నిలిచారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రాజమండ్రీ సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబును కలిసిన పవన్ వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా మరోసారి 2014లో లాగా ఏపీలో త్రి కూటమి ఏర్పడింది.