/rtv/media/media_files/2026/01/05/us-vice-president-jd-vance-2026-01-05-17-43-51.jpeg)
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున ఒహియోలోని సిన్సినాటిలో ఉన్న ఆయన జేడీ వాన్స్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటికి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
యూఎస్ స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:15 గంటలకు) ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ, కిటికీలపై దాడులు చేస్తున్నట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా, స్థానిక పోలీసుల సాయంతో భద్రతా దళాలు అతడిని వెంబడించి పట్టుకున్నాయి. నిందితుడు ఇంటిపై కాల్పులు జరిపినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దీనివల్లనే కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని సమాచారం. అయితే, ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
తప్పిన పెను ప్రమాదం
అదృష్టవశాత్తూ, ఈ దాడి జరిగిన సమయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేరు. సెలవులపై గత వారం ఇంటికి వచ్చిన వాన్స్, ఆదివారం మధ్యాహ్నమే వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. సాధారణంగా వాన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా ఫుల్ సెక్యురిటీ ఉంటుంది. ఆయన వెళ్లిన తర్వాత బారికేడ్లను తొలగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.
అదుపులోకి తీసుకున్న వ్యక్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? అతడి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అన్న కోణంలో సిన్సినాటి పోలీసులు, FBI విచారణ జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి వాన్స్పై గతంలో జరిగిన జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ దాడి వెనుక ఏదైనా విద్వేషపూరిత కోణం ఉందా అన్నది కూడా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం వాన్స్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికాలో కీలక నేతల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Follow Us