ముస్లిం దేశాలను గెలకడమే ఇజ్రాయెల్ పనా? చరిత్ర ఏం చెబుతోంది?

పొద్దున లేస్తే చాలు ఏ దేశంపై బాంబులు వెయ్యాలన్న ఆలోచన ఇజ్రాయెల్ సైన్యానిది!  ఇదేదో ఏడాది నుంచో రెండేళ్ల నుంచో జరుగుతున్న తంతు కాదు.. ఆ దేశ చరిత్రంతా ఇంతే! ఇందుకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update

తమకు ఏ మాత్రం సంబంధం లేని దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వడం ఇజ్రాయెల్ నైజం. ఇప్పుడు అదే చేస్తోంది.. గతంలోనూ అదే చేసింది.. భవిష్యత్‌లోనూ అదే చేస్తుంది. ఎందుకంటే తనది కాని భూభాగాలను తమ ఆధినంలోకి తెచ్చుకోవాలనే బుద్ధి ఇజ్రాయెల్‌ది. ఇప్పుడు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులకైనా.. ఏడాది కాలంలో గాజా గడ్డపై ఇజ్రాయెల్‌ సృష్టిస్తోన్న మారణహోమానికైనా.. తాజాగాతో ఇరాన్‌తో ప్రారంభమైన యుద్ధానికైనా ఇదే కారణం!

1948కి ముందు బ్రిటన్ అండర్ లో..

1948లో ఇజ్రాయెల్‌ తనకు తానుగా ఓ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. నిజానికి అంతకముందు ఆ ప్రాంతమంతా బ్రిటన్‌ అండర్‌లో ఉంది. అయితే బ్రిటన్‌ ఓ తప్పు చేసింది. తన పాలనలో ఉన్న జోర్డాన్‌, సిరియా, లెబనాన్‌, లిబియా దేశాల సరిహద్దులను గుర్తించింది కానీ పాలస్తీనా సరిహద్దులు గుర్తించకుండానే వైదొలగింది. దీంతో పాలస్తీనా భూభాగాలు కూడా తమవేనని ఇజ్రాయెల్‌ వాదిస్తూ ఉంటుంది. దీని కోసం పాలస్తీనా గడ్డపై 75ఏళ్లగా రక్తపాతం సృష్టిస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశమైన పాలస్తీనా నేడు చారెడు నేల కోసం పోరాడుతుందంటే అది అగ్రరాజ్యాల వైఫల్యాంగానే చెప్పుకోవాలి.

అప్పుడు అమెరికా అండతో విజయం..

అటు పాలస్తీనా భూభాగాల విషయంలో ఇజ్రాయెల్‌ అవలంబిస్తున్న విధానం అరబ్‌ దేశాలకు నచ్చలేదు. దీంతో 1948లోనే ఇజ్రాయెల్‌పై దాడికి దిగాయి. ఇది తర్వాత యుద్ధ రూపం దాల్చింది. ఈ వార్‌లో అమెరికా అండతో ఇజ్రాయెల్‌ గెలిచింది. అయితే ఇజ్రాయెల్‌ సైన్యం అంతటితో ఆగలేదు. నిరాయుధులైన పాలస్తీనా ప్రజల ఇళ్లలోకి చోరబడి వారిని చిత్రహింసలకు గురి చేసింది. దీంతో నాడు దాదాపు 7లక్షల మంది పాలస్తీనీయులు తమ పక్కనే ఉన్న ఈజిప్ట్‌, సిరియా, లిబియా, జోర్డాన్‌, లెబనాన్‌కు వెళ్లిపోయారు. నక్బా మారణహోమంగా పిలిచే ఈ రక్తపాతం ఇప్పటికీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం.

1956లో సూయజ్ కెనాల్‌ను జాతీయం చేసిన నాటి ఈజిప్ట్‌ అధ్యక్షుడు నాజర్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధానికి దిగింది. UK, ఫ్రాన్స్‌తో కలిసి ఈజిప్ట్‌పై సైనిక చర్యకు దిగింది. అయితే అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో తర్వాత తమ చర్యను ఇజ్రాయెల్‌ ఉపసంహరించుకుంది. 1967లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీన్ని సిక్స్‌ డే వార్‌ అని పిలుస్తారు. ఈ దాడి తర్వాత వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌తో పాటు గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది.

2006లో లెబనాన్‌పై..

అటు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ దళాల టార్గెట్‌గా 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. పాలస్తీనా మద్దతుదారులు ఎక్కడుంటే అక్కడ రక్తపాతం సృష్టిస్తామని చెప్పేందుకు ఇజ్రాయెల్ ఈ పని చేసింది. నాటి నుంచి నేటి వరుకు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తూనే ఉంది. 2006లో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ మరోసారి విరుచుకుపడింది. 34 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఎలాంటి ఫలితం రాలేదు. అయితే దాదాపు 1100 మంది లెబనీస్‌ ఇజ్రాయెల్‌ దాడుల్లో చనిపోయారు. పాలస్తీనా మద్దతు సంస్థ అయిన హిజ్బుల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడగా.. వారిలో 250మంది చనిపోయారు.

గాజా గడ్డపై 2009లో ఆపరేషన్ కాస్ట్ లీడ్‌..

అటు గాజా గడ్డపై 2009లో ఆపరేషన్ కాస్ట్ లీడ్‌, 2014లో ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్‌ పేరుతో రక్తపాతం సృష్టించింది. పాలస్తీనా మద్దతు సంస్థ హమాస్‌ నేతలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ ఈ యుద్ధాలకు దిగింది. ఈ యుద్ధాల్లో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఇది మానవతా సంక్షోభాలకు దారితీసింది. 2009 గాజా వార్‌లో 1,417 మంది పాలస్తీనియన్లు,  13 మంది ఇజ్రాయిలీ ప్రజలు చనిపోయారు. గాజాలో 46,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,00,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2014 గాజా వార్‌లో 2,251 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇక అక్టోబర్‌ 7, 2023 నుంచి ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో అక్టోబర్ 1, 2024నాటికి దాదాపు 41వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కుమంది అమాయక పాలస్తీనా చిన్నారులు ఉండడం అత్యంత బాధాకరం!

Advertisment
Advertisment
తాజా కథనాలు