రాయలసీమ రైతుకు అంతర్జాతీయ గుర్తింపు.. ‘రియల్‌ హీరోస్‌’ జాబితాలో చోటు

అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన నారాయణప్ప అనే రైతుకు అరుదైన గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితి, కర్మవీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన కర్మవీర్‌ చక్ర అవార్డు 2023-24 కాంస్య విభాగంలో అవార్డుకు ఎంపికయ్యారు.

రాయలసీమ రైతుకు అంతర్జాతీయ గుర్తింపు.. ‘రియల్‌ హీరోస్‌’ జాబితాలో చోటు
New Update

రాయలసీమ అంటేనే కరువుకు మరో పేరుగా మారిన సంగతి తెలిసిందే. అయితే అదే ప్రాంతంలో తనకు ఉన్న పరిమిత వనరులను ఉపయోగించుకుని ఓ రైతు అద్భుతమే చేశాడు. తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టి సీజన్‌తో సంబంధం లేకుండా చిన్న కమతాల్లోనూ లాభాలు పొందవచ్చని నిరూపించారు. ఏడాది పొడవునా నిరంతరం ఆదాయం పొందేలా ఏటీఎం (ఎనీ టైం మనీ) మోడల్‌ రూపొందించి ‘రియల్‌ హీరోస్‌’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఈ మేరకు ఐక్యరాజ్యసమితి, కర్మవీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన కర్మవీర్‌ చక్ర అవార్డు 2023-24 నారాయణప్పను వరించింది. ప్రకృతి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న రైతులకు స్వర్ణం, రజతం, కాంస్యం విభాగాల్లో ఈ అవార్డును అందజేస్తుండగా కాంస్య విభాగంలో నారాయణప్ప అవార్డుకు ఎంపికయ్యారు. సమాజానికి సురక్షిత ఆహారం అందించడంతోపాటు నేలను కాపాడటంపై ఆయన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రకటించారు. ఆయన రూపొందించిన ఏటీఎం నమూనాను రాష్ట్రంలో 3,500 మంది రైతులు అనుసరిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో నారాయణప్పకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.

Also read : Karthikamasam: కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా!

ఇక వ్యవసాయం కలిసి రాకపోవడంతో నారాయణప్ప కొంతకాలం భవన నిర్మాణ కార్మికునిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టారు. తండ్రి నుంచి వచ్చిన 30 సెంట్ల భూమిలో రసాయనాలు లేకుండా పంటలు సాగు చేస్తున్నారు. ఏడాదికి రెండు పంటలతో సరిపెట్టకుండా ఏడాది పొడవునా పంట దిగుబడులొచ్చేలా ఎనీ టైం మనీ (ఏటీఎం) విధానానికి శ్రీకారం చుట్టారు. తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలోనే ప్రకృతి వ్యవసాయం చేపట్టి ప్రస్తుతం ఏకంగా 20 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. తన ఇంటికి సరిపడా పంట ఉంచుకుని మిగిలిన వాటిని మార్కెటింగ్‌ చేయడం ద్వారా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జిస్తున్నారు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయాన్ని రాబట్టి తక్కువ విస్తీర్ణంలో అధిక లాభాలు పొందవచ్చని రుజువు చేసి చూపించారు. అక్కడితో ఆగకుండా తోటి రైతులకు కొత్త తరహా సాగు విధానాన్ని పరిచయం చేశాడు. గ్రామంలోనే తనతో పాటు మరో 25 మందికి ఏటీఎం మోడల్‌ సాగును నేర్పించాడు. వీరందరినీ చూసి పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులు నారాయణప్ప బాటలో నడుస్తున్నారు.నారాయణప్ప ఈ వినూత్న విధానంలో మట్టి, భూమి ఆరోగ్యంగా మారడంతోపాటు భూమి మెత్తబడి ఆకు, కాండం ఆరోగ్యంగా ఉంటున్నాయి.

అలాగే ఏటీఎం మోడల్‌లో సాగు చేయడం ద్వారా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ‘క్త్లెమేట్‌ ఛేంజ్‌’ సాధ్యమవుతోందని గుర్తించారు. ఏటీఎం మోడల్‌ను ప్రపంచంలోనే ఏ గ్రేడ్‌ మోడల్‌గా గుర్తించడంతోపాటు ఏడాది పొడవునా పంటలు పండించడం ద్వారా అత్యధిక లాభాలను ఆర్జించడంతో పాటు నేలల్లో కర్బన స్థిరీకరణకు దోహదపడేలా కృషి చేశారు. తాను చేస్తున్న సాగు విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు రైతు నారాయణప్ప. గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతిగడించిన దివంగత శాస్తవేత్త ఎంఎస్‌ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్‌ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళా రంగంలో కాజోల్‌ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చేరారు.'

#narayanappa #farmer #international-recognition
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe