YS Sharmila: తిరగబడ్డ బాణం.. అన్నపై షర్మిల పోరాటం ఎందుకు?

జగన్‌కు షర్మిల ఎందుకు వ్యతిరేకంగా మారారు? ఈ వైఎస్‌ కూతురి కథేంటి? పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ను ఆమె నిలబెట్టగలరా?ఏపీలో షర్మిల ప్రభావం ఎంత? ఎవరికి నష్టం? ఎవరికి లాభం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

YS Sharmila: తిరగబడ్డ బాణం.. అన్నపై షర్మిల పోరాటం ఎందుకు?
New Update

YS Sharmila:  సరిగ్గా 12ఏళ్ల క్రితం వైఎస్‌ జగన్‌ జైలుకు వెళ్లిన కాలమది. కాంగ్రెస్‌ నుంచి విడిపోయి కొత్త పార్టీని స్థాపించిన జగన్‌ సోనియాకు ఎదురెళ్లారు. పలు అవినీతి కేసుల్లో నిందితుడిగా చంచలగూడ జైల్లో ఉన్న జగన్‌కు తన పార్టీని ఎలా నడిపించాలో తెలియని స్థితిలో ఉన్నారు. అప్పుడే ఆయన చెల్లెలు షర్మిలా ఎంట్రీ ఇచ్చారు. వైసీపీని ముందుండి నడిపించారు. అన్న లేని లోటును కనిపించకుండా పార్టీకి పెద్దదిక్కుగా మారారు. సీన్‌ కట్‌ చేస్తే.. కాంగ్రెస్ విల్లు నుంచి జగన్‌‌పైకి దూసుకెళ్లే బాణంగా షర్మిల మారారు. అసలు ఈ 12ఏళ్లు ఏం జరిగింది? జగన్‌కు షర్మిల ఎందుకు వ్యతిరేకంగా మారారు? ఈ వైఎస్‌ కూతురి కథేంటి? పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ను ఆమె నిలబెట్టగలరా? లాంటి విషయాలు ఇవాళ తెలుసుకుందాం!

షర్మిల హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె 1995లో మొరుసుపల్లి అనిల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. అనిల్‌ తెలంగాణలో హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి మారారు. నిజానికి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సీఎంగా కొనసాగుతున్న కాలంలో షర్మిల రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఆయన మరణం తర్వాత కూడా ప్రజల మధ్య షర్మిల కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. 2011లో వైసీపీని స్థాపించిన జగన్‌ 2012లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసుల్లో జైలుకు వెళ్లారు. నాడు వైసీపీని జనంలోకి తీసుకళ్లే బాధ్యతను తీసుకున్నారు షర్మిల. వైసీపీ జాతీయ కన్వీనర్‌గా, జగన్ చెల్లిగా ఒక రకంగా పార్టీలో తన మార్క్‌ చూపించారు షర్మిల. 2012లో ఏపీ ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిందంటే అది షర్మిల ప్రచారం కారణంగానేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుటారు. జగన్‌ జైలు నుంచి బయటకు వచ్చే సమయానికి పార్టీని స్ట్రీమ్‌ లైన్‌ చేసిన క్రెడిట్‌ షర్మిలకే దక్కుతుంది.

రాజకీయాల్లో పాదయాత్రలు సృష్టించే ప్రకంపనలు అన్నీఇన్నీ కావు. ఇదే ఫార్ములాతో అధికారంలోకి వచ్చిన నేతలు ఎంతోమంది ఉన్నారు. షర్మిల తండ్రి రాజశేఖర్‌రెడ్డి సైతం 2004 ఎన్నికలకు ముందు పాదయాత్రతో జనంతో మమేకమయ్యారు. ఇది ఆయన విజయానికి కారణమైంది. షర్మిలా సైతం వైసీపీ కోసం రికార్డు స్థాయిలో 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అక్టోబర్18, 2012న ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర అగస్టు 4,2013న ఇచ్చాపురం వరకు కొనసాగింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీకి ఊపిరి పోసింది ఈ పాదయాత్రనే అని చెప్పవచ్చు.

2019 ఎన్నికల ముందు షర్మిల చంద్రబాబుపై వేసిన కౌంటర్లు, పేల్చిన సెటైర్లు సామాన్య జనంలో ఆమె క్రేజ్‌ను పెంచాయనే చెప్పాలి. బైబై బాబు పేరుతో 11 రోజులపాటు బస్సు యాత్ర చేశారు షర్మిల. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. షర్మిలకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గిందన్న ప్రచారం జరిగింది. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు షర్మిల దూరంగా ఉంటూ వచ్చారు. 2021నాటికి వైసీపీతో షర్మిల తన సంబంధాలను పూర్తిగా తెంచుకున్నారు. వైటీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించారు.

ఒకప్పుడు సమైక్యవాదిగా ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడాన్ని నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. షర్మిల టార్గెట్‌గా పలు చర్యలకు పాల్పడింది. ఓ సారి షర్మిల కారులోనే ఉండగా పోలీసులు ఆమెను క్రేన్‌లో తీసుకెళ్లారు. ఇక 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే సమయానికి షర్మిల కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేశారు.

నాడు జగన్‌ బాణంగా జనంలోకి దూసుకొచ్చిన షర్మిల.. నేడు అదే జగన్‌పై విమర్శాల బాణాలు సంధిస్తున్నారు. తన బాబాయ్‌ వివేకను చంపిన వారిని జగనే కాపాడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మోసానికే బ్రాండ్ అంబాసడర్ జగన్‌ అని ర్యాలీల్లో, సభల్లో ఫైర్ అవుతున్నారు. ఇక షర్మిల ఎంట్రీ తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతాయా లేదా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్నఒకటే.. ఏపీలో షర్మిల ప్రభావం ఎంత? ఎవరికి నష్టం? ఎవరికి లాభమన్నది చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ కు వణుకు పుట్టించిన ఇరాన్ సంచలన ప్రకటన.. అసలేం జరిగిందంటే?

#ys-jagan #ap-news #ap-politics #elections-2024 #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe