IND Vs ZIM: జింబాబ్యేతో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల భారీ తేడాతో గెలిచి 4-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 167/6 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 125 పరుగులకు \ ఆలౌట్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజు శాంసన్ (58; 45 బంతుల్లో 1×4, 4×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (12; 5 బంతుల్లో 2×6) రజా బౌలింగ్లో బౌల్డయ్యాడు. తొలి డౌన్లో వచ్చిన అభిషేక్ శర్మ (14; 11 బంతుల్లో 1×4,1×6) పెద్దగా రాణించలేకపోయాడు. మరో ఓపెనర్ గిల్ (13; 14 బంతుల్లో 2×4) పరుగులు చేశాడు. చివర్లో శివం దుబే (26), రింకూ సింగ్ (11) కాస్త దూకుడుగా ఆడటంతో భారత్ మంచి స్కోరే చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాణి 2 వికెట్లు పడగొట్టగా.. సికిందర్, రిచర్డ్, బ్రాండన్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ వెస్లీ (0) బౌల్డయ్యాడు. బ్రియాన్ (10)తో కలిసి మరో ఓపెనర్ మరుమాణి (27) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మరుమాణి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. చివర్లో అక్రమ్ (27) కాస్త ఫర్వేలేదనిపించాడు. భారత్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా.. శివం దుబే 2, తుషార్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.