IND vs AUS: భారత్ ఖాతాలో వరుసగా రెండో విజయం

ఆస్ట్రేలియాతో తిరువనంతపురంలో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. బ్యాట్స్ మెన్ వీర విహారంతో భారత్ ఖాతాలో వరుసగా రెండో విజయం నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 235 పరుగులు సాధించగా; ఛేదనలో ఆసిస్ 191 పరుగుల వద్దే ఆగిపోయింది.

New Update
IND vs AUS: భారత్ ఖాతాలో వరుసగా రెండో విజయం

IND vs AUS: భారీ లక్ష్యాన్ని కంగారూలు ఛేదించలేకపోవడంతో ఆస్ట్రేలియాతో తిరువనంతపురంలో జరిగిన రెండో టీ 20 (T20I) మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. బ్యాట్స్ మెన్ వీర విహారంతో భారత్ ఖాతాలో వరుసగా రెండో విజయం నమోదైంది. సిరీస్ లో 2 - 0తో ఆధిక్యంలో నిలిచింది. యశస్వి, రుతురాజ్, ఇషాన్, రింకూ చెలరేగి ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఆసిస్ మొదట్లో తడబడి తర్వాత కుదురుకుంది. అయితే, ఐదో వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యం మినహా.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. చివర్లో మాథ్యూ వేడ్ (23 బంతుల్లో ఒక ఫోర్, 4సిక్సర్లతో 42) భారీ సిక్సర్లు బాదినప్పటికీ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.

ఇది కూడా చదవండి: బోర‘బండ’ బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో!

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు యశస్వి, రుతురాజ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆసిస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన యశస్వి జైశ్వాల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సేన్ అబ్బాట్ వేసిన నాలుగో ఓవర్లో అయితే వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన ఈ యువ ఓపెనర్ 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. క్రీజులో ఉన్నంత సేపూ అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిన యశస్వి (25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు) ఐదో ఓవర్ చివరి బంతికి నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలివికెట్ కు రుతురాజ్ తో కలిసి 77 పరుగులు జోడించాడు.

ఇది కూడా చదవండి: ధోనీ ఫ్యాన్స్‎కు పండుగే.. రిటెన్షన్ లిస్టులో ‘మిస్టర్ కూల్’

అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కంగారూ బౌలర్లకు ధాటిగా జవాబిచ్చాడు. రుతురాజ్ కూడా బ్యాట్ జళిపించడంతో భారత స్కోరు 10 ఓవర్లలోనే 100 పరుగులు దాటింది. భారీ షాట్లతో విరుచుకుపిన ఇషాన్ 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి స్టాయినిస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 15.2 ఓవర్లలో రెండు వికెట్లకు 164 పరుగులు. రెండో వికెట్ కు రుతురాజ్, ఇషాన్ కిషన్ కలిసి 87 పరుగులు జోడించారు. మరో ఎండ్ లో రుతురాజ్ నిలదొక్కుకుని స్థిరంగా పరుగులు తీస్తూ, వీలైనప్పుడు బంతిని బౌండరీ దాటిస్తూ స్కోరును ముందకు నడిపాడు. చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్న గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఇషాన్ తర్వాత సూర్యకుమార్ వస్తూవస్తూనే రెండు సిక్సర్లు బాదాడు. 19 పరుగులు చేసి ఔటయ్యాడు. లాస్ట్ మ్యాచ్ హీరో రింకూ సింగ్ 18.3 ఓవర్ల వద్ద సిక్సర్ బాది స్కోరును డబుల్ సెంచరీ దాటించాడు. మరోసారి కంగారూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన రింకూ 9 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 31 పరుగులు రాబట్టాడు.

ఇది కూడా చదవండి: రిటెన్షన్ లిస్టులో ట్విస్టులు.. చివరికి హోం టీంకే వచ్చిన హార్ధిక్

లక్ష్య ఛేదనలో ఆసిస్ మొదట్లోనే తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. కంగారూ బ్యాటర్లలో స్టాయినిస్ (45), మాథ్యూ వేడ్ (42), డేవిడ్ (37) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. మధ్యలో స్టాయినిస్ (25 బంతుల్లో 2ఫోర్లు 4సిక్సర్లతో 45) మెరుపులు మెరిపించి ఆందోళన కలిగించినా ముఖేశ్ కుమార్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. చివరిలో మాథ్యూ వేడ్ వేగంగా పరుగులు రాబట్టినప్పటికీ మ్యాచ్ అప్పటికే భారత్ చేతిలోకి వచ్చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు