OPS: పాత పింఛను విధానం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది: జయ ప్రకాశ్ నారాయణ

ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని ఎఫ్‌డీఆర్‌ వ్యవస్థాకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. 3 శాతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం 97 శాతం ఉన్న ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

New Update
OPS: పాత పింఛను విధానం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది: జయ ప్రకాశ్ నారాయణ

పాత పింఛను విధానంపై ఫౌండేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఎఫ్‌డీఆర్‌) వ్యవస్థాపకుడు, లోక్ సత్తా పార్టీ అధినేత డా.జయప్రకాశ్‌ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు జీవన్మరణ సమస్యలాంటిదని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా ఎలా మారిందనే దానిపై ఢిల్లీలో ‘ఏ వయబుల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫిస్కల్‌ ప్రుడెన్స్‌’ పేరిట ఎఫ్‌డీఆర్‌ ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత జయ ప్రకాశ్ నారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్నిపార్టీల అంగీకారంతో నూతన పింఛను విధానం(NPS) తీసుకొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మన్మోహన్‌ సింగ్ ప్రధానమంత్రి అయ్యాకా ఆయన‌ దాన్ని వేగంగా అమలు చేశారు. కొంతకాలంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాష్ట్రాలు మళ్లీ తిరోగమన విధానం వైపు వెళ్తున్నాయి. ఓపీఎస్‌ విధానం అనేది దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది.

దేశం, రాష్ట్రాల ఆదాయం కంటే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు అలాగే అప్పులకు చెల్లించే వడ్డీల మొత్తమే ఎక్కువగా ఉంటోందని అన్నారు. కేవలం 3 శాతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం 97 శాతం ఉన్న ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలగజేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవ్యక్తి తలసరి ఆదాయం రూ.1,92,587 ఉంటే.. తలసరి పింఛను రూ. 5,32,000 ఉంది. అమెరికాలో ఒక వ్యక్తి తలసరి ఆదాయం 70.249 డాలర్లు ఉంటే పింఛను 16,920 డాలర్లు మాత్రమే ఉంది. అయితే ఉద్యోగుల పింఛను విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. వాటి గురించి చర్చించి ఒక ఏకాభిప్రాయం తీసుకురావాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు జీపీఎస్ రూపంలో దృష్టిసారించాయని' జయప్రకాశ్ నారయణ వివరించారు.

Also Read: నాటుకోడి కూర, బగరా రైస్‌ వండిన మంత్రి కేటీఆర్‌!

రాజకీయ పార్టీలు కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ మాజీ ప్రధాన కమిషనర్ టి.ఎస్‌ కృష్ణమూర్తి అన్నారు. అప్పుల వల్ల రాజస్థాన్, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు డా.గోవిందరావు వ్యాఖ్యానించారు. ఓపీఎస్ విషయంలో ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు