Elections 2024: ఎన్నికల వేళ బీజేపీ పొత్తుల క్రీడ.. ఏమిటో ఆ వ్యూహం!

సార్వత్రిక ఎన్నికల ముందు నాలుగు కీలక రాష్ట్రాల్లో పాత మిత్రులతో కొత్త పొత్తులు కుదుర్చుకుంది బీజేపీ. మోదీ గాలి దేశమంతా ఊపేస్తున్న వేళ బీజేపీ పొత్తుల క్రీడ వెనుక రాజకీయ వ్యూహం ఏమిటనేది పెద్ద ప్రశ్న. ఈ పొత్తులపై విశ్లేషణాత్మక కథనం టైటిల్ పై క్లిక్ చేసి చూడవచ్చు. 

Elections 2024: ఎన్నికల వేళ బీజేపీ పొత్తుల క్రీడ.. ఏమిటో ఆ వ్యూహం!
New Update

Elections 2024: బీజేపీ పొత్తుల లెక్కలు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు పొడించిందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాట్లు కూడా దాదాపుగా జరిగిపోయింది. ఇక ఎన్నికలకు మూడు పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లడమే మిగిలింది. ఎన్నికలకు కూడా పెద్ద సమయం ఏమీలేదు. ఇప్పుడో.. అప్పుడో నోటిఫికేషన్ వచ్చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ స్ట్రాటజీ ఏమిటనేది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎంతోకాలంగా తనతోనే నడుస్తూ వస్తున్న ఎన్డీఏ మిత్రులతో పొత్తులు.. సీట్ల సర్దుబాటు ఎలాగూ తప్పదు. కానీ, విచిత్రంగా కొన్ని రాష్ట్రాల్లో నిన్నటివరకూ తనను తెగిడిన వారితోనే స్నేహ బంధం ఏర్పాటు చేసుకోవడమే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ జనతాదళ్, కర్ణాటక లో దేవెగౌడ జేడీఎస్, బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ ఇక ఏపీలో చంద్రబాబు టీడీపీతో బీజేపీ పొత్తులే ఆశ్చర్యానికి కారణంగా ఉన్నాయి. ఎందుకంటే, ఈ నాలుగు పార్టీలు గతంలో (Elections 2024)ఎన్డీఏలో భాగస్వాములే. వీరంతా ఎన్డీఏ నుంచి దూరంగా జరిగి.. బీజేపీ మీద మోదీ మీద నిప్పులు చెరిగారు. ఇందులో కొందరు అయితే, మోదీని ఒకప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరు అనే మాట కరెక్టే కానీ, ప్రస్తుతం బీజేపీ ఉన్న పరిస్థితికి ఇదంతా అవసరమా అనేదే పెద్ద ప్రశ్న. 

ఒంటరిగా 370.. కూటమిగా 400 సీట్లు టార్గెట్ గా బీజేపీ ఈ ఎన్నికల్లో (Elections 2024)పోటీకి రెడీ అవుతోంది. ఈ మాట ఆ పార్టీ నాయకులు చాలా సార్లు చెప్పారు.. చెబుతూ వస్తున్నారు. మరి ఆ కోణంలో చూసినా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులు ఆ పార్టీని సొంతంగా ఎదగడానికి అవకాశాలు లేకుండా చేసే పరిస్థితి ఉందనేది స్పష్టం. ఉదాహరణకు ఒడిశాను తీసుకుంటే, అక్కడ నవీన్ పట్నాయక్ కి ఆయన వయసు రీత్యా  బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. అటువంటి పరిస్థితిలో అక్కడ ఎదురులేని జనతాదళ్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి.. పొత్తుకోసం ముందుకు వెళ్లడం ఏ రాజకీయ వ్యూహం అనేది అంతుపట్టడం లేదు. 

అలాగే బీహార్ రాజకీయాలు. నితీష్ కుమార్ ఆయారాం.. గయారాం విధానంలో సిద్ధహస్తుడు. ఎటువంటి కళంకం లేకుండా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలంగా ముందుకి సాగుతున్నారు. కానీ, ఆయన ఎప్పుడూ స్థిరంగా ఒకపార్టీ లేదా ఒక కూటమి పొత్తులో ఉండరు. ఒక్కోసారి ఒక్కోలా.. చిత్తానికి మారిపోతూ ఉంటారు. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కూడా బీజేపీ ఒంటరిగా ఎదగడానికి ఛాన్స్ ఉంది. కానీ, దానిని పక్కన పెట్టి నితీష్ కుమార్ కి హగ్ ఇవ్వడం ఎందుకో బీజేపీ పెద్దలకే తెలియాలి. 

దక్షిణాది విషయానికి వస్తే.. బీజేపీ సౌత్ లో గట్టిగా పాగా వేయాలని చేయని ప్రయత్నం లేదు. కానీ, ఎప్పటికప్పుడు అవన్నీ ఢమాల్ అంటూనే ఉన్నాయి. ఇప్పటివరకూ బీజేపీ సౌత్ లో గట్టిగ నిలబడడానికి అవకాశం దొరకలేదు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో కొద్దిగా రాజకీయాలు నడిపి.. పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నా.. అక్కడ నిలబడలేక గత అసెంబ్లీయే ఎన్నికల్లో(Elections 2024) కాంగ్రెస్ కి పగ్గాలు అప్పగించేసింది. అయితే, ఇక్కడా ఎక్కువ కిచిడీ రాజకీయాలే చేసింది బీజేపీ. అందులో ప్రధానంగా దేవెగౌడ తో కలిసి వెళ్లడం. ఎప్పటికప్పుడు.. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. రాత్రి ఒకే చెప్పి పొద్దున్నే ఇంకో పార్టీకి జైకొట్టేంత అస్థిరమైన మనిషి దేవెగౌడ. గతంలో ఎన్డీఏలో కూడా దేవెగౌడ కలిసి ఉన్నారు. కానీ, తరువాత విడిపోయారు. ఇప్పుడు దేవెగౌడతో రాజీపడి పొత్తుకు సై చెప్పింది. ఇక్కడా బీజీపీ ఒకడుగు వెనక్కి వేసిందనే చెప్పాలి. దక్షిణాదిన మరో పొత్తు పల్లకీ ఏపీలో ఎక్కుతోంది బీజేపీ. గతంలో మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు తరువాత వైసీపీ ట్రాప్ లో పడిపోయి గత ఎన్నికల సమయంలో బీజేపీతో తెగతెంపులు చేసుకోవడమే కాకుండా, అంతటి మోదీని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అయినా.. అన్నీ మర్చిపోయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుకు రెడీ అయిపోయారు. దీనివెనుక జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటారు. కానీ, ఇప్పుడు టీడీపీతో పొత్తుకు వెళ్లడం మాత్రం ఆ పార్టీని ఏపీలో మరింత కిందకి లాగుతుందనిపిస్తోంది. 

ఈ నాలుగు ఉదంతాలు చూస్తే, పరిశీలిస్తే.. ఎవరికైనా నిజమే కదా బీజేపీ అంత స్థాయి నుంచి ఎందుకు ఈ రాష్ట్రాల్లో ఒంటరి ప్రయత్నాలు(Elections 2024) చేయకుండా జత కోసం చూస్తోంది అనిపిస్తుంది. బీజేపీ మొదటి నుంచీ చాలా రాష్ట్రాల ఎన్నికల్లో తాను గెలవకపోయినా ఫర్వాలేదు.. కాంగ్రెస్ ముందుకు రాకుండా ఉంటె చాలు అనే ధోరణిలోనే సాగుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నా.. వారిని తన కనుసన్నల్లో ఉంచగలిగే చాతుర్యం ఉన్నపుడు.. అక్కడ అధికారంలో ఉన్నా.. లేకపోయినా పెద్దగా ఫరక్ పడదని ఆ పార్టీ నాయకులూ అనుకునుటున్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా అదే స్ట్రాటజీతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యూహంతోనే పెద్దగా రిస్క్ లేకుండా ఈ ఎన్నికల్లో తన టార్గెట్ రీచ్ కావడం కోసం.. పొత్తులకు జై కొట్టినట్టు కనిపిస్తోంది. 

Also Read: పొత్తులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. పవన్‌కు షాక్?

మనం ఏపీ రాజకీయాల (Elections 2024)వరకే చూసుకుంటే కనుక.. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నా.. టీడీపీ అధికారంలో ఉన్నా బీజేపీకి, మోదీకి వచ్చే నష్టం ఏమీలేదు. రెండు పార్టీలు కూడా కేంద్రంలో మోదీ  చెప్పినట్టు వింటాయి. లోపాయికారీగా సపోర్ట్ చేస్తాయి. గత ఐదేళ్ళలో మనం చూసింది అదే. కారణాల జోలికి పోవద్దు కానీ, ఏపీలో వైసీపీ ఎంతలా రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి బీజేపీ కొమ్ముకాసింది అనేది అందరూ చూసిందే. ఎలాగూ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య.. మూడో ప్రాంతీయ పార్టీ కూడా సిద్ధం అయినపుడు.. అక్కడ ప్రత్యేకంగా ఎదగడానికి పోయి పంతంతో పోవడం కంటే, ఎదో పొత్తుతో నాలుగు ఎంపీ సీట్లు పోగేసుకుంటే బెటర్ అని బీజేపీ అధిష్టానం అలోచించి ఉందనిపిస్తోంది. అంతంత మాత్రమే బలం ఉన్న చోట ఒంటరిగా పోటీచేసి దెబ్బ తినేకంటే.. గట్టిపోటీ ఇచ్చే పార్టీలను కలుపుకుని పోతే ఆ గాలి కూడా తమకు అనుకూలమై కొన్ని సీట్లు రావచ్చని ఆలోచన వారిది అయివుండొచ్చని అనుకోవచ్చు. 

ఏది ఏమైనా.. బీజేపీ పొత్తు రాజకీయం ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీ నాయకులూ పెట్టుకున్న టార్గెట్ తీసుకువస్తుందో.. రాదో ఎన్నికల (Elections 2024)తరువాత కానీ తేలదు. ఈలోపు ఈ పొట్టులోనైనా పోటీ విషయంలో కింది స్థాయిలో అందరినీ కలుపుకుపోతారా లేదా అన్నది మరో పెద్ద ప్రశ్న. దానికి కూడా కాలమే సమాధానం చెప్పాలి. 

Watch this interesting Video:

#2024-lok-sabha-elections #tdp #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి