Telangana Crop Loan Waiver: తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్?

తెలంగాణలో రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చాలామంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికీ మాఫీ కాలేదని.. అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది.

New Update
Telangana Crop Loan Waiver: తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్?

Revanth - Harish Rao :  తెలంగాణలో ప్రస్తుతం రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు మేము అందరికీ రుణమాఫీ చేస్తామని.. సాంకేతిక కారణల వల్ల కొంతమందికి మాఫీ జరగలేదని రేవంత్ సర్కార్ చెబుతోంది. మరోవైపు రుణమాఫీ డొల్లా అని.. చాలా మంది రైతులకు మాఫీ జరగలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇలా రుణమాఫీపై అధికార, విపక్ష పార్టీలు విభిన్న అభిప్రాయలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న రైతుందరికీ మాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఎప్పుడంటూ బీఆర్ఎస్‌ పార్టీ రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించింది. దీంతో సీఎం రేవంత్ ఆగస్టు 15 నాటికే రూ.2 లక్షల వరకు లోన్‌ ఉన్న రైతులకు మాఫీ చేస్తామని ప్రకటించారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు స్పందించారు. ఆగస్టు 15 లోపు రాజీనామా చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ మాఫీ చేయకపోతే రేవంత్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు. ఇక చివరికి రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ అమలు పనులు మొదలుపెట్టింది. ఆగస్టులోపు మూడు దశల్లో అమలు చేస్తామని ప్రకటించింది.

Also Read: విగ్రహ వివాదం వేళ సచివాలయంలో ఆసక్తికర పరిణామం.. స్వయంగా రంగంలోకి సీఎం!

జులై 18న సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని, నెలాఖరులోపు రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. ఇక ఆగస్టులో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకకాలంలో ఇప్పటివరకు రూ.31వేల కోట్లతో రైతు రుణాలు మాఫీ చేయలేదంటూ వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది రైతులకు మాఫీ అవ్వడం, మరికొంత మంది రైతులకు మాఫీ కాకపోవడంతో రేవంత్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. కొంతమందికే చేసి మిగతా రైతులకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రేవంత్ సర్కార్ స్పందించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు మాఫీ ఆగిపోయిందని తెలిపింది. వాటిని పరిష్కరించిన తర్వాత అర్హులైన వారందరికీ మాఫీ జరుగుతుందని పేర్కొంది.

కానీ బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను దీనిపై నిలదీస్తూనే ఉంది. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని.. కానీ కేబినెట్ మాత్రం కేవలం 31 వేల కోట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిందని తెలిపింది. ఇక బడ్జెట్లో 26 వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్ లో కేటాయించిన రూ. 26 వేల కోట్లలో కూడా కేవలం రూ.18 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచిందని మండిపడింది. రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని దుయ్యబట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన మండల కేంద్రాలు/ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హారీశ్ రావు సైతం రుణమాఫీ అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ వస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. ''ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 18వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నారు. మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఏకంగా 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారు.

Also Read: కొరడా ఝళిపిస్తోన్న హైడ్రా.. మీ ఆస్తులు సేఫేనా ? ఇలా చెక్ చేసుకోండి

ఏది నిజం. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలి. ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే, భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. మీరు చెబుతున్నట్లు రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ల చూట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే రుణమాఫీ పై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆగస్టు 15 వరకు రైతులందరిని రుణవిముక్తులుగా చేస్తానన్న హామిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని'' హరీశ్ రావు రాసుకొచ్చారు.

మరోవైపు రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. వీటికి సంబంధించిన కారణాలను చెబుతూ.. వాటి పరిష్కారాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఈ పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో, మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నాయని తెలిపింది. రుణమాఫీ కాని రైతులకు 31 సాంకేతిక కారణాల జాబితాను అందించాలని.. అందులో వారికి సంబంధించిన సమస్యను, దాని పరిష్కారాన్ని తెలియజేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్‌.. సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చూట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. రుణమాఫీపై నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వాటి ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలకు దిగింది. కేవలం 27 రోజుల్లోనే ప్రభుత్వం రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని.. రూ.31 వేల కోట్లతో మాఫీ చేసి తీరుతుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Also Read : పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా

Advertisment
తాజా కథనాలు