/rtv/media/media_files/2026/02/25/youtuber-komali-2026-02-25-11-52-30.jpg)
ప్రముఖ యూట్యూబర్ కోమలి (21) సూసైడ్ హైదరాబాద్లో కలకలం రేపింది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె, మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. విశాఖపట్నంకు చెందిన కోమలి, హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ, పార్ట్ టైమ్గా యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, తోటి యూట్యూబర్ అయిన అఖిల్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అఖిల్ రెడ్డి మొహం చాటేయడం, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితం బ్రేకప్ అయ్యింది.
ఆరు నెలల క్రితమే హెచ్చరిక
ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక కోమలి ఆరు నెలల క్రితమే ఆత్మహత్యకు యత్నించారు. అప్పట్లో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ అఖిల్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. కోమలి మరణానికి ముందు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్ల కళ్లు చెమర్చుతున్నాయి. తన ప్రియుడితో మళ్లీ కలిసి ఉండాలని కోరుకుంటూ ఆమె తిరుమల కాలినడకన వెళ్లారు. ప్రతీ మెట్టుకు బొట్టు పెడుతూ కొండ ఎక్కుతూ తీసిన ఆ వీడియోనే ఆమె జీవితంలో చివరిది అవుతుందని ఎవరూ ఊహించలేదు. తన మొక్కులు ఫలించకపోవడం, ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అఖిల్ రెడ్డి వేధింపులే తన కూతురి మరణానికి కారణమని కోమలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us