CM Revanth Reddy: బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. ఈ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రసంగం సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉందని అన్నారు. రిజర్వేషన్ల రద్దు గురించి ఆధారాలతో సహా నేను వాదిస్తున్నానని పేర్కొన్నారు. నా వాదనలపై సరైన వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మోడీ, అమిత్ షాకు ఉందని అన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టడానికి కచ్చితంగా పోరాడుతా అని అన్నారు.
"మోడీ, అమిత్షాలకు సూటి ప్రశ్న. మీ పార్టీ ఆలోచన ఏంటో చెప్పండి. గతంలో మీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు చూడకుండా మాట్లాడుతున్నారు. 2002 జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక సీక్రెట్గా పెట్టారు. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ మాట్లాడిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. రాజ్యాంగం మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఆ గెజిట్. 2002లో రాజ్యాంగ సవరణపై నివేదిక ఇచ్చారు. 2004లో బీజేపీని ప్రజలు తిరస్కరించడంతో రిజర్వేషన్లు ఎత్తేసే ప్రమాదం తప్పింది." అని వ్యాఖ్యానించారు సీఎం.
"కేంద్రం చేస్తున్న దాడులను అందరూ చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మూలసిద్దాంతాల గురించే నేను మాట్లాడుతున్నా. అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూలసిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ మూలసిద్దాంతాలను అమలు చేయడమే బీజేపీ అజెండా. రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగకుండా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తోందని చెప్పినందుకే నాపై అక్రమ కేసులు పెట్టారు. గాంధీభవన్కు వచ్చి కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు" అని విమర్శలు చేశారు.