CM Chandrababu: రాత్రంతా మెలుకువతో ఉండి పనిచేయండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

AP News: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై ఆరాతీస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా సిఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డివోలు, డిఎస్పీలతో మాట్లాడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు అధికారలు చంద్రబాబుకు తెలుపగా.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

రాత్రంతా మెలుకువతో ఉన్నాసరే..
మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారంతో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య నేటి రాత్రి తుఫాను తీరం దాటుతుందని అంచనతో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మూడు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలని తెలిపారు. రాత్రంతా మెలుకువతో ఉన్నాసరే ప్రజల రక్షణ కోసం పని చేద్దామని చెప్పారు. తుఫాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఎటువైపు వెళుతుంది? అనే విషయాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. నష్టం జరిగిన తరువాత స్పందించడం కాదు.. నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను నేడు పాటించాలని అధికారులకు తెలిపారు.

టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజలకు సూచనలు:
* వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
* కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది..రేపు కూడా వర్షాలు పడతాయని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.
* భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు....కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున నిధుల విడుదల చేస్తున్నాం.
* పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది.
* ప్రోక్లెయినర్లు పెట్టి నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగించాలి.
* నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను యుద్దప్రాతిపదికన తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలి.
* ఓపెన్ డ్రైన్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది....ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయండి...అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి.
* బుడమేరులో నీటి ఉదృతి తీవ్రంగా ఉందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు.
* బుడమేరు ఆక్రమణ వల్ల వరద సమయంలో సమస్యలు వస్తున్నాయని వివరించిన అధికారులు...సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలన్న సిఎం
* వరద ప్రాంతాల్లో, వాగులపై వాహనదారులను అనుమతివద్దు. ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయండి
* ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపివేయండి.
* ప్రకాశం బ్యారేజ్ నుంచి పంటకాలువలకు నీటి విడుదల నిలపివేసినట్లు వివరించిన అధికారులు
* విజయవాడ నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు
* భారీ వర్షాలు, గాలుల వల్ల తీగలు తెగి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది....కరెంట్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలి.
* కనకదుర్గ టెంపుల్ లో ప్రమాదం విచారకరం.....భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోండి
* కొండ ప్రాంతాల్లో ఉన్నవారిని అవసరం అయితే ఖాళీ చేయించండి. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించాలి.
* పంట కాలువల్లో, డ్రైన్ లలో నీటి ప్రవాహాలకు అడ్డులేకుండా చూడండి.
* సైక్లోన్ షెల్టర్స్ ను సిద్ధం చేసి పునరావాసం కోసం ఏర్పాట్లు చేయండి
* గర్భిణుల వివరాలు సేకరించి...అవసరమైన సాయం అందించేందుకు సిద్దంగా ఉండండి
* మీడియా, సోషల్ మీడియా ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా క్షణక్షణం ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటున్నా....అధికారుల అలసత్వం కనిపిస్తే సహించేది లేదు.
* పెదకాకాని ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందిన ఘటనపై అధికారులను వివరణ కోరిన సిఎం
* పాఠశాలకు సెలవు ఇవ్వలేదా అని అధికారులను ప్రశ్నించిన సిఎం
* మధ్యాహ్నం తరువాత సెలవు ప్రకటించి విద్యార్థులను పంపారన్న అధికారులు
* భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి....ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి.
* వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవుపై ప్రకటన చెయ్యాలి
* ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం సహాయం చేయడం కాదు....ప్రమాదం జరగకుండా చూడడం పై యంత్రాంగం దృష్టిపెట్టాలి
* భారీ వర్షాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాను...అధికారులు కూడా వాట్స్ యాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెప్పించుకుని వేగంగా స్పందించాలి
* అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదు....విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవాలి
* హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన విధానాలను కలెక్టర్లు స్టడీ చేయాలి....నాడు తీసుకున్న పటిష్ట, ముందస్తు చర్యల ద్వారా ప్రాణ నష్టం లేకుండా చేశాం.
* ఆ విధానాలను స్టడీ చేసి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

Advertisment
తాజా కథనాలు