/rtv/media/media_files/NnW2WdpDpbhh1ZwIDfNO.jpg)
MANCHU MANOJ
మోహన్బాబు యూనివర్సిటీ విషయంలో మంచు బ్రదర్స్ మధ్య రచ్చ కొనసాగుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు నిరసనబాట పట్టగా.. కాలేజీలోని అక్రమాలు తండ్రి దృష్టికి తీసుకెళ్తానని మనోజ్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. మంచు మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారు పేరుగా సినీ ఇండస్ట్రీలో టాక్. అలాంటి మోహన్బాబు ఫ్యామిలీ ఇటీవల కాలంలో వివాదాల పేరుతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆయనకు ముగ్గురు సంతానం. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ కాగా కుమార్తె మంచు లక్ష్మి. విష్ణు ప్రస్తుతం మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మనోజ్ అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి వ్యాపారాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే కొంతకాలం క్రితమే మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్ మధ్య విభేదాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఇద్దరూ ఒకరి మీద మరొకరు చేయిచేసుకునేంత వరకు వెళ్లింది వ్యవహారం. మంచు లక్ష్మి జోక్యంతో గొడవ సద్దుమణిగింది. తాజాగా తిరుపతిలో ఉన్న మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీ విషయమై మంచు మనోజ్ చేసిన ట్వీట్ కుటుంబ వివాదాలను మరోమారు బహిర్గతం చేసింది.
Also Read : హీరో సిద్దార్థ్- అదితి పెళ్లి ఫొటోలు వైరల్!
విద్యార్థుల ఆందోళనకు మనోజ్ మద్దతు..
తిరుపతిలో ఉన్న మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీలో ఫీజలు, ఇతర ఖర్చుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారంటూ వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. ఈ విషయమై మంచు మనోజ్ "ఎక్స్" వేదికగా స్పందించారు. తన తండ్రి పేరు మీద ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీ, శ్రీవిద్యానికేతన్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలను చూసి బాధ కలిగిందని, తన తండ్రి ఉన్నత విలువలతో విద్యాసంస్థలను స్థాపించారని.. రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ఉంటారని పేర్కొన్నారు.
ఆయన ఆలోచన, అభిరుచిని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్కి పూర్తి మద్దతును అందించాలనుకుంటున్నానని.. అక్కడున్న పరిస్థితి, ఫిర్యాదుల విషయమై ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వినయ్ని సంప్రదించి వివరణ అడిగానని, అతని సమాధానం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. దయచేసి ఏవైనా ఫిర్యాదులు ఉంటే పర్సనల్గా మెయిల్ పంపాలని కోరుతూ.. ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేసిన మనోజ్.. ఆ ఫిర్యాదులను తన తండ్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని ట్వీట్లో మనోజ్ చెప్పుకొచ్చారు.
Also Read : అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్దమైన ‘తంగలాన్’..!
మనోజ్ ట్వీట్తో బయటపడ్డ విభేదాలు..
ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పనులు మా అధ్యక్షుడు మంచు విష్ణు చూస్తున్నట్లు తెలుస్తోంది. విష్ణు జోక్యం వల్లే యూనివర్సిటీలో గొడవలు తలెత్తాయనేది మనోజ్ ట్వీట్ చూసిన వారికి అర్థమవుతుంది. మోహన్ బాబుకు తెలియకుండానే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విషయాన్ని మనోజ్ పరోక్షంగా చెబుతున్నాడు. అయితే తన ట్వీట్లో ఎక్కడా విష్ణు ప్రస్తావన తీసుకురాలేదు మనోజ్.
I’ve been made aware of concerns at @IVidyanikethan#MBUniversity from it deeply saddens me. My father, Chancellor Sri Dr. Mohan Babu garu, has always prioritized the well-being of students and the Rayalaseema community, which is reflected in the success of these institutions.…
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2024
తమ కుటుంబ విద్యాసంస్థలపై ఆరోపణలు వస్తే ఖండించాల్సిన వ్యక్తే.. రివర్స్లో ఆ ఆరోపణలు చేస్తున్న వారికి మద్దతివ్వడం చూస్తే త ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయనే హింట్ను ఇచ్చారు. శ్రీవిద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్శిటీలకు సంబంధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రీసెంట్గా మీడియా సమావేశం నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు. అలాగే ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఆయా సంస్థలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ క్రమంలో మంచు మనోజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రస్తావించడంతో.. విషయం చాలా దూరం వెళ్లే అవకాశం ఉంది. అయితే దీనిపై మోహన్ బాబు, అలాగే మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్!