Hindupuram: నేడు చలివెందుల సర్పంచ్‌ ఉప ఎన్నిక.. గెలిచేది ఎవరు..?

హిందూపురంలోని చలివెందుల గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ-టీడీపీ పోటాపోటీగా ప్రచారాలు చేశాయి. చలివెందుల, రాచపల్లి, మీనకుంటపల్లి గ్రామాలలో అత్యధిక ఓట్లు బీసీ, ఎస్సీ వర్గాలు ఉన్నందున.. సర్పంచ్ ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.

New Update
Hindupuram: నేడు చలివెందుల సర్పంచ్‌ ఉప ఎన్నిక.. గెలిచేది ఎవరు..?

హోరాహోరీగా పోటీ..

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందుల పంచాయతీ సర్పంచ్‌ ఉప ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతున్నాయి. వైసీపీకి చెందిన సర్పంచ్‌ సౌభాగ్యమ్మ మృతితో ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఆ పార్టీ మద్దతుదారుడుగా ఆమె కుమారుడు ఉపేంద్రరెడ్డి, టీడీపీ నుండి రవీంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరి మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. చలివెందుల పంచాయతీ పరిధిలో రాచపల్లి, మీనకుంటపల్లి గ్రామాలు ఉండగా మొత్తం 2514 మంది ఓటర్లు ఉన్నారు. చలివెందులలోనే ఉన్న నాలుగు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పోలింగ్ జరగనుంది. మ. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది.

ఎవరు గెలిచినా.. తక్కువ మెజార్టీతోనే..

12 మంది పోలింగ్ సిబ్బంది, 40 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. డీఎస్పీ కన్జక్షన్ నేతృత్వంలో భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా అభ్యర్థులు ఇద్దరు బాబాయ్ అబ్బాయిలు కావడం, పోటాపోటీగా ఓటర్లకు డబ్బులు పంచడంతో ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ మద్దతుదారుడు కోసం స్వయంగా ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలో దిగి అన్ని రకాల సహకారం ఇచ్చినట్లు ప్రచారం.  వైసీపీ మద్దతుదారుడు గెలుపు కోసం ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ దీపికవేణు కూడా సవాల్‌గా తీసుకుని ప్రచారం చేశారు.

పట్టం ఎవరికో..?

ఈ సర్పంచ్ ఉపఎన్నిక గెలుపు ప్రభావం సాధారణ ఎన్నికలపై పడే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా వైసీపీ నూతన సమన్వయకర్త దీపిక, ఉపేందర్ రెడ్డి గెలుపును సీరియస్‌గా తీసుకున్నారు. అదే తరుణంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం టీడీపీ శ్రేణులను అలర్ట్ చేసి ఎలాగైనా టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచి తీరాలని కంకణం కట్టుకున్నారు. రెండు రోజుల ప్రచారాల్లో వైసీపీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ ప్రచారంలో పాల్గొనడం విశేషంగా మారింది. వైసీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నూతన సమన్వయకర్త దీపిక, మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులందరు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే చలివెందుల గ్రామపంచాయతీ ప్రజలు ఎవరి గెలుపును ఆకాంక్షిస్తారో ఈ సాయంత్రం వరకు వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు