Tirumala : తిరుమలలో అపచారం.. అలిపిరి మెట్లమార్గంలో మటన్ ముక్కలు!

తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహారం తినడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని భక్తులు హెచ్చరించగా, సిబ్బంది బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ అపచారంపై టీటీడీ అధికారులు స్పందించారు.

New Update
Tirumala ttd

ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా.. గోవిందా అంటూ ఆ శ్రీనివాసుడి ఆలయానికి  చేరుకునేందుకు కోట్లాది మంది భక్తులు పాదయాత్ర చేసే పవిత్రమైన మెట్ల మార్గం అది.. అలాంటి మార్గం ఇప్పుడు తీవ్ర అపవిత్రతకు గురైంది. భక్తులు పారాయణం చేసుకుంటూ వెళ్లే మార్గంలో బహిరంగంగా మాంసాహారం తింటూ కొంతమంది టీటీడీ కాంట్రాక్టు కార్మికులు కనిపించారు. 

తిరుమల కొండకు కాలినడకన వెళ్లే పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం తినడం స్థానికంగా, భక్తులలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు పాల్పడింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులుగా అధికారులు గుర్తించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా వారిని  ఉద్యోగాల నుంచి తొలగించింది. 

బహిరంగంగా మటన్ తింటూ

అలిపిరి నడక మార్గంలో విధుల్లో ఉన్న టీటీడీ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో బహిరంగంగా మటన్ తింటూ కనిపించారు. తిరుమల కొండపై, మెట్ల మార్గంలో మాంసాహారం, మద్యం వినియోగం పూర్తిగా నిషేధం. ఈ ప్రాంతం పవిత్రమైనదిగా భావించే భక్తులు, కార్మికుల చర్యను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటుగా వెళ్తున్న కొందరు భక్తులు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియోను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. 

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, ఈ విషయం టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగించినందుకు గాను టీటీడీ అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి, మాంసాహారం తిన్న ఆ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు  రామస్వామి, సరసమ్మలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు