/rtv/media/media_files/2025/08/11/ap-new-2025-08-11-21-35-00.jpg)
ఏపీలోని కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఫోకస్ పెట్టింది. వైసీపీ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు కూటమి నేతలు హామీలిచ్చారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీలో ఏడుగురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాల పేర్ల మార్లు, కొత్త మండలాల ఏర్పాటుపై డిసెంబర్లోపు వర్కౌట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కూటమి పునర్వ్యవస్థీకరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
పాత జిల్లాల్లో కలపాలని
ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32కు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో వేరు చేసిన నియోజకవర్గాలను తిరిగి వాటి పాత జిల్లాల్లో కలపాలని కోరుతున్నారు. ఉదాహరణకు, గన్నవరం నియోజకవర్గాన్ని తిరిగి కృష్ణా జిల్లాలోకి, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చాలనే ఆలోచన ఉంది. కొన్ని జిల్లాలకు ప్రస్తుతం ఉన్న కేంద్రాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. కొన్ని జిల్లాల పేర్లను మార్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి.
మంత్రివర్గ ఉపసంఘం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలకు, చారిత్రక, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రక్రియకు నెల రోజుల్లో సమయం సరిపోదని, దీనికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.