Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, యానాంలో వర్షాలు కురవనున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షం పడతాయని.. అన్నదాతలు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరో మూడు రోజులు:
బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడిందని అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక- తమిళనాడు తీరాల దగ్గర డిసెంబర్ 12 నాటికి మరింత బలపడే అవకాశం ఉందన్నారు. ఏపీ, యానాంలోని ఈశాన్య దిశ, తూర్పు దిశగా గాలులు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఫెంగల్ తుపాను తర్వాత ఏపీలో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కొన్నిచోట్ల వర్షం కురుస్తోంది. ఇవాళ అనంతపురం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తూ.గో, కాకినాడ, ప.గో, కోనసీమ, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మరో రెండు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
తెలంగాణలో వర్షాలు:
అల్పపీడనం ప్రభావం వలన తెలంగాణలో పలు జిల్లాల్లో మూడ్రోజులపాటు తేలికపాటి వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మిగతా అన్ని జిల్లాల్లోనూ కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురవనుందని అధికారులు పేర్కొన్నారు.
Also Read: అధిక కోపం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది?