/rtv/media/media_files/2025/06/14/fs2CIRe7YP7LyXNzivLC.jpg)
Fire Accident in Kurma Village
Fire Accident in Kurma Village : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని అధ్యాత్మిక కూర్మగ్రామం అగ్నికి అహుతైంది. గ్రామంలోని ఆధ్యాత్మిక మందిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ నెల 10న రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి వర్ణాశ్రమ కృష్ణమందిరం పూర్తిగా దగ్ధమైంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో ఉండే ఈ గ్రామానికి చాలా ప్రత్యేకతులున్నాయి. ఈ గ్రామంలో విద్యుత్తు ఉండదు. టీవీలు, సెల్ఫోన్ల వాడకం ఉండదు. అంతేకాదు ఎటువంటి ఆధునిక నిర్మాణాలేవి ఉండవు. గ్రామస్తులు అంతా ప్రకృతి ఒడిలోనే హాయిగా జీవిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేసిన వారంతా జీవిత పరమార్థం ఇది కాదని భావించి సనాతన ధార్మిక జీవనం గడిపేందుకు నిర్ణయించుకున్నారు. వారంతా ఈ గ్రామంలో సరికొత్త జీవన విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాంటి గ్రామంలో ఆధ్యాత్మిక మందిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయడం కలకలం సృష్టించింది.
కాగా గ్రామంలో జరిగిన సంఘటన విషయం తెలిసిన వెంటనే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కూర్మ గ్రామాన్ని సందర్శించారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో వెళ్లిన ఎమ్మెల్యే గ్రామాన్ని పరిశీలించారు. ఆ రాత్రి జరిగిన విషయాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
2018 లో గ్రామం ఏర్పాటు
ఇస్కాన్కు చెందిన భక్తివేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశాలతో 2018 జులైలో భక్తివికాస్స్వామి సారథ్యంలో ఈ కూర్మ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. సరళ జీవనం, ఉన్నత చింతనం ఈ గ్రామ విధానం. అత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని వారు అనుభవపూర్వకంగా నిరూపిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయంతోనే వీటిని పండించుకుంటున్నారు. గ్రామంలో ఉమ్మడి వ్యవసాయం, ఉమ్మడి ఉత్పత్తి, ఉమ్మడి పంపిణీ అనే విధానంతో పనిచేస్తున్నారు.
గ్రామ ప్రత్యేకత ఇది
ఇక్కడి వారు తినడానికి దంపుడు బియ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. వారు స్వయంగా నేసిన దుస్తులనే వాడుతున్నారు. ఇండ్లు సైతం వారే స్వయంగా నిర్మించుకుంటారు. సనాతన ధర్మం, వైదిక సంస్కృతి, వర్ణాశ్రమ విధాన పునఃస్థాపన లక్ష్యంగా ఇక్కడి వీరంతా జీవనం సాగిస్తున్నారు. తమ దుస్తులకు, శరీరానికి ఏ మాత్రం సబ్బులు ఉపయోగించరు. కుంకుడుకాయ రసంతో తమ దుస్తులను ఉతుక్కుంటారు. ఇసుక, సున్నం, బెల్లం, కరక్కాయ, మెంతులు, మినుములు మిశ్రమంగా చేసి, వాటిని గానుగలో ఆడించి, గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లను నిర్మించుకున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గ్రామంలో దుండగులు నిప్పుపెట్టడంతో విలువైన ధ్యాన మందిరంతో పాటు పలు గ్రంథాలు కాలిబూడిదయ్యాయి.
అగ్ని ప్రమాదం దురదృష్టకరం : పవన్ కళ్యాణ్
కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించే గ్రామం ఇది అని పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమన్నారు, అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని పవన్ ఆదేశించారు. ఘటనపై అనుమానాలు ఉన్న దృష్ట్యా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలన్న పవన్ పోలీసులకు సూచించారు. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడాలని సూచించారు. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైందని పవన్ తెలిపారు. యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా నిర్మించిన ఇళ్లలో అక్కడి వారు ఉంటున్నారని ఆయన వెల్లడించారు. కూర్మ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.