/rtv/media/media_files/2025/10/31/ex-mayor-2025-10-31-11-32-29.jpg)
చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఐదుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరగడంతో కోర్టు సీరియస్గా తీసుకుంది. 2015 నవంబర్ 17న ఈ దారుణ హత్య జరగగా తాజాగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దంపతుల హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ పది సంవత్సరాల కేసు విచారణలో తాజాగా కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1) ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇతను మృతుడు కఠారి మోహన్ మేనల్లుడు. వెంకటాచలపతి (A2), జయప్రకాష్ రెడ్డి (A3), మంజునాథ్ (A4), వెంకటేష్ (A5)గా ఉన్నారు. ఈ కేసులో మొదటగా చార్జిషీట్లో ఉన్న మొత్తం 23 మంది నిందితుల్లో, A6 నుంచి A23 వరకు ఉన్న మిగిలిన నిందితులపై కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.
తుపాకులు, కత్తులతో దారుణంగా హత్య
2015 నవంబర్ 17న చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోనే కఠారి అనురాధ (అప్పటి మేయర్), ఆమె భర్త కఠారి మోహన్ను బురఖా ధరించిన దుండగులు తుపాకులు, కత్తులతో దారుణంగా హత్య చేశారు. రాజకీయ, కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పదేళ్లలో కేసు విచారణ సందర్భంగా దాదాపు 122 మంది సాక్షులను విచారించారు. ఈ సంచలన కేసులో తీర్పును సవాలు చేస్తూ నిందితులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది.
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us