/rtv/media/media_files/2025/11/08/pawan-kalyan-mass-warning-to-red-sandalwood-smugglers-2025-11-08-19-19-58.jpg)
Pawan Kalyan mass warning to red sandalwood smugglers
ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాములను ఆయన ఇవాళ పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
Pawan Kalyan warning to smugglers
ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్#PawanKalyanpic.twitter.com/QMlijXAVvO
— Telugu360 (@Telugu360) November 8, 2025
ఎర్రచందనం చెట్ల పుట్టుక వెనుక ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉందని తెలిపారు. ఈ చెట్లు వెంకటేశ్వరస్వామి గాయం రక్తం నుంచి పుట్టాయని అన్నారు. అందువల్ల ఈ చెట్లను ఎవరూ నరకవద్దని, అక్రమంగా విక్రయించొద్దని పేర్కొన్నారు.
స్మగ్లింగ్ కార్యకలాపాల వెనుక ఉన్న పెద్ద తలకాయలను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం దుంగలు కొట్టే కూలీలను పట్టుకోవడంతోనే సరిపెట్టవద్దని, వారిని నడిపిస్తున్న కింగ్పిన్స్ ఎవరు?.. వారి నెట్వర్క్ ఎలా విస్తరించి ఉంది అనే దానిపై లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. స్మగ్లర్లను నడిపిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని అన్నారు. ఆ సమయంలోనే సుమారు 2.65 లక్షల ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారని.. ఇంకా దొరక్కుండా స్మగ్లింగ్ చేసింది ఇంతకు మించి ఉండొచ్చని అంచనా వేశారు. అప్పుడు పట్టుకున్న దుంగలను బట్టి.. దాదాపు 1.30 లక్షల చెట్లను నరికివేశారని.. వీటి విలువ దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ఇలా 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు రూ.8 నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.
శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి ప్రత్యేక వ్యూహాలను అమలు చేయాలని, అవసరమైతే 'ఆపరేషన్ పుష్ప' తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణా జిల్లాలు, రాష్ట్రాలు దాటి, విదేశాలకు తరలిపోతున్న నేపథ్యంలో నిఘా వ్యవస్థలను పటిష్టం చేయాలని.. అటవీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
గత ఐదేళ్లలో శేషాచలం అడవుల నుంచి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని అన్నారు. ఎర్రచందనం అని వదిలేస్తామని అనుకోవద్దని, చట్టపరంగా అందరి అంతు చూస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ప్రజా సంపదను దోచుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదు అంటూ పవన్ కళ్యాణ్ స్మగ్లర్లకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. అందువల్ల ఎవరూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయొద్దని.. ఏపీ, తమిళనాడు వాళ్లకు ఇదే లాస్ట్ వార్నింగ్ అని తెలిపారు.
Follow Us