ఏపీ రాజధాని అమరావతి పూర్తి చేయడానికి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో జల్జీవన్ మిషన్, రాజధాని అమరావతి పనులతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. జల్జీవన్ మిషన్కు ఇంతకు ముందే ఆమోదం లభించి ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు. దీంతో 25 శాతం పూర్తైన పనుల టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలిచేందుకు కేబినెట్ అంగీకరించింది. అలాగే అమరావతిలో 45 పనులకు సంబంధించి రూ.33వేల కోట్ల రుణ సమీకరణకు సీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అప్రూవల్ వచ్చింది. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి ఓకే చెప్పింది కేబినెట్. .బుడమేరు సహా పది జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు అంగీకారం తెలిపింది.
గ్రీన్ ఎనర్జీ, మధ్యాహ్న భోజన పథకం..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్లో ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకోడానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్కు కూడా అనుమతి లభించింది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీఇతో పాటూ క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని మంత్రమండలిలో నిర్ణయించారు. రూ.1 కోటీ 70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో NTPC జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా 1.06 లక్షల ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి పార్థసారధి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపారు. దీంతో 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.