Tirumala Laddu: తిరుపతి లడ్డూలోనే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లోనూ జంతువుల నూనె?

మీరు స్ట్రీట్ ఫుడ్ బాగా తింటారా? తక్కువ ధరకే టేస్టీ ఫుడ్ అంటూ వీధుల్లో లభించే ఫుడ్ ను తెగ లాగించేస్తూ ఉంటారా? జంతువుల కొవ్వును తిరుపతి లడ్డూలోనే మాత్రమే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లో కూడా వాడతారని మీకు తెలుసా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

author-image
By B Aravind
New Update
Street Food

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం వెలుగులోకి రావడం తీవ్ర దుమారం రేపుతోంది. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా.. కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్‌ విలువ 95.98 నుంచి 104.32 మధ్య ఉండగా.. ఒక శాంపిల్‌ నెయ్యి విలువ 19.72గా వచ్చింది. మరో రెండు శాంపిల్స్‌ను పరిశీలించగా దాదాపు 20 వరకు ఎస్‌ వాల్యూ వచ్చింది. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో ఈ స్థాయిలో కల్తీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె, జంతువుల మాంసంతో తయారు చేసిన కల్తీ నూనె సైతం ఉండటం కలకలం రేపుతోంది.      

బీఫ్‌ టాలో, లార్డ్‌ కలకలం 

సోయాబీన్‌, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి గింజలు, సన్‌ఫ్లవర్, ఆలివ్, ర్యాప్‌సీడ్, లిన్‌సీడ్, కొబ్బరి, పల్లీ, పామ్ కెర్నాల్ ఫ్యాట్, పామ్ ఆయిల్,చేప నూనె, బీఫ్‌  టాలో, లార్డ్‌ లాంటి పదార్థలతో నెయ్యిని, అలాగే నూనెలను కల్తీ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో చేప నూనె, బీఫ్‌ టాలో, లార్డ్‌ తో తయారు చేసిన నూనె ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. బీఫ్‌ టాలో అనేది గొడ్డు మాంసం నుంచి తయారు చేసే పదార్థం. దీని తయారీకి గొడ్డు మాంసం ముక్కలను వాడుతారు. ఈ మాంసం నుంచి తీసిన కొవ్వును ముందుగా కరిగిస్తారు. ఆ తర్వాత దాన్ని ద్రవంగా మార్చడం వల్ల దీన్ని తయారు చేయవచ్చు. అది చల్లబడ్డాక తేలికైన పదార్థంగా ఘనీభవిస్తుంది. రూమ్‌ టెంపరేచర్‌ వద్ద మృదువైన వెన్న వలె ఆ టాలో కనిపిస్తుంది. 

ఇక లార్డ్‌ అనేది పందులు, ఇతర జంతువుల కొవ్వుల నుంచి తయారు చేసే పదార్థం. అయితే తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఈ పదార్థాలు కూడా కలపడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశం మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ పదార్థాలను కలిపి నెయ్యిని కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని మాత్రమే రిపోర్టులో ఉంది. కానీ.. కచ్చితంగా వాటినే కలిపారని మాత్రం ఈ రిపోర్టు ఆధారంగా చెప్పలేం. అలాగే జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేయలేదనే విషయం కూడా కొట్టిపారేయలేం. ఇప్పుడిదే అంశం కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

Also Read: తిరుమల ప్రసాదంపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్‌

కోట్లల్లో వ్యాపారం

ఇదిలాఉండగా గతంలో కూడా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వ్యర్థాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. గతేడాది జూన్ లో సైతం జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం అలాగే చనిపోయిన జంతువుల కళేబరాలను పలు మూతబడిన ఫ్యాక్టరీల్లోకి తీసుకొస్తున్నట్లు ఆ సమయంలో గుర్తించారు. ఆ తర్వాత అందులో ఉండే భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వు, జంతు కళేబరాలను మరగబెట్టి.. ఆ తర్వాత వాటి నుంచి నూనెను బయటకు తీస్తున్నట్లు తేల్చారు. ఆ నూనెను డబ్బాలు, ప్యాకెట్లలో నింపి వాటికి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీటివల్ల కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు గుర్తించారు. ఇలాంటి నూనెను తక్కువ ధరకు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది తెలిసి.. మరికొంత మంది తెలియక ఈ నూనెను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ జంతువుల నుంచి తీసే ఈ కల్తీ నూనెతో ఏటా క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి కల్తీ నూనె వల్ల రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ కల్తీ నూనె వల్ల కాలేయం, కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అందులో ఉండే హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అనేది కేన్సర్‌కు దారితీస్తుందని.. కనీసం ఆ నూనె వాసన పీల్చినా కూడా ప్రమాదమే అనే చెబుతున్నారు.

Also Read: తిరుమల లడ్డూ వివాదం..చిలుకూరు ప్రధానార్చకులు ఏమన్నారంటే!

ఫాస్ట్‌ఫుడ్‌ లోనూ కల్తీ నూనె?

ఇదిలాఉండగా.. సాధారణంగా ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌, నూడిల్స్‌, మిర్చీలు, బజ్జీలు లాంటివి జనాలు ఎగబడి తింటుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లే కనిపిస్తాయి. హైదరాబాద్‌ తో పాటు అనేక ప్రాంతాల్లో పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లలో కల్తీ నూనె వాడినట్లు గతంలో అనేక సార్లు బయటపడింది. ఇప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ వార్తల అనంతరం మరోసారి ఈ విషయం చర్చనీయాంశమైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లపై దాడులు నిర్వహించి కల్తీ నూనె తయారీ, సరఫరాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

Advertisment
తాజా కథనాలు